పోలవరంకు భారీగా వరదనీరు .. 19 గ్రామాలకు నిలిచిన రాకపోకలు .. భయాందోళనలో ప్రజలు
పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి పోటెత్తుతోంది. వరద ఉధృతి ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో బాగా పెరిగింది .ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు వద్ద భారీగా చేరుకున్న వరదనీటి ప్రభావంతో పరిసర 19 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరికి భారీగా వరద నీరు చేరుతుండడంతో నిర్వాసిత గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తూరు కాజ్ వే పైకి 6 అడుగుల మేర వరదనీరు చేరుకుంది.
Recommended Video
ఎగువ రాష్ట్రాలలో కురుస్తున్న వర్షాలతో పోటెత్తుతున్న పోలవరం .. డ్యాం దగ్గర అధికారుల రక్షణా చర్యలు
తెలంగాణ రాష్ట్రంతో పాటు,మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలతో సీలేరు, ఇంద్రావతి, శబరి ఉపనదుల నుండి వరద నీరు గోదావరిలోకి పోటెత్తడంతో గోదావరి ఉధృతరూపం దాల్చింది. ఇక వరద ఉధృతి గంటగంటకు పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యాం దగ్గర ప్రమాదకర స్థాయిలో వరదనీరు చేరుతోంది. దీంతో అధికారులు ఎగువ కాపర్ డ్యాం ,లోయర్ కాపర్ డ్యాం ల రక్షణ కోసం బౌల్డర్ వాల్స్ వేశారు. గతేడాది పోలవరం స్పిల్ వే లో చంద్రబాబు ప్రారంభించిన గేటును తొలగించారు .వరద ఎక్కువగా వస్తే స్పిల్ వే నుంచి నీటిని మళ్లించే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.
స్పిల్ వే నుండి నీటిని మళ్ళించే ఆలోచన .. చంద్రబాబు హయాంలో బిగించిన గేటు తొలగింపు
ఈ ఏడాది ఇరిగేషన్ అధికారుల అంచనా ప్రకారం 6-8 లక్షల క్యూసెక్కుల వరకు వరద రావచ్చు . 8 లక్షల క్యూసెక్కుల లోపు వరద ఉన్నా కాఫర్ డ్యాంకు ఎటువంటి నష్టం ఉండదని చెబుతున్నారు. కానీ 5 లక్షల క్యూసెక్కుల వరద దాటితే ఎగువభాగంలో నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది కాబట్టి 5లక్షల క్యూసెక్కులు దాటితే స్పిల్వే నుంచి మళ్లిస్తామని అధికారులు చెబుతున్నారు. అందుకే చంద్రబాబు హయాంలో బిగించిన గేటు ని తొలగించారు. ఇక వరద తీవ్రత పెరిగితే నిర్వాసిత గ్రామాలను ఖాళీ చేయించే ఆలోచనలో కూడా అధికారులు ఉన్నారు.
19 నిర్వాసిత గ్రామాలకు రాకపోకలు బంద్ .. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు
ఇక మరోపక్క పోలవరం పక్కన ఉన్న 19 నిర్వాసిత గ్రామాల ప్రజలు వరద పోటెత్తడంతో భయాందోళనలో ఉన్నారు . 19 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అధికారులు ఆ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే మూడు నెలలకు సరిపడా రేషన్ సదరు గ్రామాల్లో నిల్వ చేశామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. నిర్వాసిత గ్రామాల ప్రజలను అవసరం అనుకుంటే సహాయ శిబిరాలకు తరలించడానికి కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వరద ఉధృతి వల్ల ప్రస్తుతానికి కాపర్ డ్యాం కు ఎలాంటి నష్టం లేదని అధికారులు చెప్తున్నా , కాపర్ డ్యాం నిర్మాణం వల్లే వరద గ్రామాల ను ముంచెత్తే ప్రమాదం ఉందని అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.