భారీ వర్షాలతో ఏపీ అతలాకుతలం- పలు జిల్లాల్లో కుండపోత- మరో మూడురోజులింతే....
అంధ్రప్రదేశ్ భారీవర్షాలతో అతలాకుతలం అవుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలపై వర్షం ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. రాబోయే మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణశాఖ ప్రకటించింది.
మూడురోజులు వర్షాలు, హైదరాబాద్లో భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల ప్రభావంతో పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు పలు చోట్ల రాకపోకలకు కూడా అంతరాయం కలుగుతోంది. తూర్పుగోదావరి జిల్లా ఈతకోటలో గరిష్టంగా 21.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కోస్తాలోని మిగతా జిల్లాల్లోనూ భారీ వర్షపాతం నమోదవుతోంది. భారీ వర్షాలకు పలు జిల్లాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారీ వర్షాల దృష్యా ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో కలెక్టర్లు పరిస్ధితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అల్పపీడనం నేపథ్యంలో మత్సకారులు సముద్రంలో వెళ్లొద్దని హెచ్చరికలు చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేయించేందుకు రెవెన్యూ యంత్రాంగం ప్రయత్నాలు మొదలుపెట్టింది.
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ఉత్తర కోస్తాంధ్ర సమీపానికి చేరింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతం అయిన ఈ అల్పపీడనం రేపటికల్లా మరింత బలపడి రానున్న నాలుగు రోజులపాటు పశ్చిమ వాయవ్యంగా పయనించవచ్చని అంచనా. దీని ప్రభావంతో తెలంగాణ, కోస్తాంధ్ర లో రేపు భారీనుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. కోస్తా ఆంధ్ర తీరాన 40-50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.