మరో మూడ్రోజులపాటు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు
విజయవాడ: మరో మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగస్టు 18 నాటికి ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని భారత వాతావరణ విభాగం తెలిపింది.
కోస్తాంధ్ర తీరం వెంట ఉపరితల ద్రోణి
ప్రస్తుతం పశ్చిమబెంగాల్, ఒడిశాలోని కోస్తా ప్రాంతాలను ఆనుకుని ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రాంతం స్థిరంగా కొనసాగుతోంది. దీనికి తోడు కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతోందని వాతావరణశాఖ స్పష్టం చేసింది.
ఉత్తరాంధ్రకు భారీ వర్షాలు
బెంగాల్- ఒడిశా తీరాన్ని ఆనుకుని ఉన్న తీవ్ర అల్పపీడన ప్రాంతం మరింత బలపడి వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. వీటి ప్రభావంతో నైరుతి రుతుపనాలు మరోసారి క్రియాశీలంకంగా మారాయని అధికారులు చెబుతున్నారు.
వీటి ప్రభావంతో ఒడిశాతో పాటు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
కోస్తాతోపాటు రాయలసీమలోనూ..
అటు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ మోస్తరు నుంచి విస్తారంగానే వర్షాలు పడుతున్నట్టు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. అటు రాయలసీమ జిల్లాల్లోనూ తేలిక పాటి జల్లులు పడతున్నాయి.
రాగల రెండు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోనూ చాలా చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణశాఖ పేర్కొంది.
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో..
ఇప్పటికే విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా చోట్ల 6 సెంటిమీటర్ల వరకూ వర్షం కురిసినట్లు వాతావరణశాఖ స్పష్టం చేసింది. 1.5 సెంటిమీటర్ల నుంచి 4 సెంటిమీటర్ల మధ్య 269 ప్రాంతాల్లో వర్షం కురిసిందని అధికారులు వెల్లడించారు. కాగా, తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా సాధారణ వర్షపాతం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.