ఏపీపై తీవ్ర వాయుగుండం- రాత్రికి నరసాపురం-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం
బంగాళాఖాతంపై విస్తరించిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తున్నాయి. తొలుత ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం నిన్నటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి మారింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందని వాతావరణశాఖ ప్రకటించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కోస్తాలోని తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. దాదాపు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తున్నాయి. ఇవాళ సాయంత్రం ఏడు గంటల కల్లా దీని ప్రభావం మరింత తీవ్రం కానుందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. రాత్రికి పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం- విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశముందని తెలిపింది.
Recommended Video
వాయుగుండం ప్రభావంతో ఇప్పటికే మొదలైన వర్షాలు పలు జిల్లాలను ముంచెత్తుతున్నాయి. ఉత్తరాంధ్రపై వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. పలు చోట్ల గత 24 గంటల్లో దాదాపు 20 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇవాళ, రేపు కూడా భారీవర్షాలు కొనసాగనున్నాయి. రాత్రికి వాయుగుండం తీరం దాటే సమయంలో గంటకు 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. దీంతో తీర ప్రాంతాల్లో ప్రజలను అఫ్రమత్తం చేస్తున్నారు. ప్రభుత్వం కోస్తా జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేసింది. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ఆదేశాలు ఇస్తున్నారు.