తీవ్ర వాయుగుండం, భారీ వర్షాలు: మత్స్యకారులకు హెచ్చరిక జారీ
హైదరాబాద్/విజయవాడ: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాలకు వాయుగుండం తోడు కావడంతో భారీ వర్షపాతం నమోదవుతున్నట్లు చెన్నైలోని వాతావరణ సమాచార కేంద్రం తెలిపింది.
మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని ఆంధ్రప్రదేశ్ తీర వాసులను, అటు తమిళనాడు తీరవాసులను వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రస్తుతం వాయుగుండం చెన్నైకు ఆగ్నేయంగా 180 కిలోవీుటర్లు, పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 110 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
వాయుగుండం మరింత బలపడి సోమవారం మధ్యాహ్నానికి తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సోమవారం రాత్రికి చెన్నై-కారైక్కాల్ మధ్య వద్ద ఇది తీరం దాటే అవకాశం ఉందని చెబుతున్నారు.
దీని ప్రభావంతో తీరం వెంబడి 45-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దీంతో ఏపీలోని అన్ని ఓడరేవుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీచేశారు. వాయుగుండం ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాలో తీరం వెంబడి గంటకు 50-55 కిమీ వేగంతో, ఉత్తర కోస్తాలో 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు బలంగా వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ సందర్భంగా నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. మత్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించింది.
తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. మరోపక్క సోమవారం ఉదయం నుంచి చిత్తూరు జిల్లాలోని కాళహస్తి, సత్యవేడు,ప్రాంతాల్లో తిరుమలలో కుండపోత వర్షం పడుతోంది.