వీడియో: భారీ వర్షానికి కారిపోయిన గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం! వీఐపీ లాంజ్ లో వర్షపునీళ్లు
విజయవాడ: కృష్ణాజిల్లాలో భారీ వర్షం కురిసింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మరో 36 గంటల పాటు ఇదే పరిస్థితి ఉండొచ్చని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. బుధవారం సాయంత్రం రెండున్నర గంటలపాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి జిల్లాలోని గన్నవరం విమానాశ్రయం జలమయమైంది. విమానాశ్రయం వీఐపీ లాంజ్, టెర్మినల్, సిబ్బంది కార్యాలయాలు.. వంటి పలు ప్రదేశాల్లో చూరు కారుతూ కనిపించింది. అడుగులోతు వర్షపు నీళ్ల నిలిచిపోయాయి.
విమానాశ్రయ సిబ్బంది వాటిని బకెట్లతో ఎత్తి పోయాల్సి వచ్చింది. ఈదురు గాలులకు కార్యాలయ పైభాగం దెబ్బతినడంతో వర్షపు నీరు కారినట్లు సిబ్బంది తెలిపారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే విమానాశ్రయం డైరెక్టర్ మధుసూదనరావు టెర్మినల్ కు చేరుకున్నారు. నీరు చేరిన గదులను పరిశీలించారు. ప్రయాణికులు సేదతీరడానికి ఏర్పాటు చేసిన లాంజ్ మొత్తం వాననీటితో తడిచి ముద్దయింది. సోఫా సెట్లపై కూర్చోవడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది.
వీడియో: భారీ వర్షానికి కారిపోయిన గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం! pic.twitter.com/TP9BlmNGfO
— Oneindia Telugu (@oneindiatelugu) August 22, 2019
మంగళ, బుధవారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. అనంతపురం, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది. అనంతపురం సహా ఆత్మకూరు, కనగానపల్లి, అమడగూరు, బుక్కపట్నం, కొత్తచెరువు, పుట్టపర్తి తదితర మండలాల్లో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జిల్లాల్లో సుమారు 54 మండలాల్లో వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
వీడియో: వీఐపీ లాంజ్ లో వర్షపునీళ్లు pic.twitter.com/GVCLQJH2Je
— Oneindia Telugu (@oneindiatelugu) August 22, 2019
ఫలితంగా చెక్ డ్యామ్లు, కుంటలు నిండాయి. కృష్ణా, పశ్చిమ గోదావరిలతో పాటు విశాఖపట్నంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కాగా- తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా అండమాన్ సముద్ర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో మరో 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల వర్షాలు పడే అవకాశం వుందని అధికారులు తెలిపారు. గురు, శుక్రవారాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు.