ఏపీలో అకాల వర్షాలు: పిడుగుపాటుకు 10 మంది మృతి
అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం సాయంత్రం కురిసిన అకాల వర్షాలకు సుమారు 10 మందికిపైగా మృత్యువాత పడ్డారు. వర్షాల కారణంగా పిడుగులు పడి ఎక్కువ మంది మృత్యువాత పడ్డారు. గుంటూరు జిల్లాలోనే సుమారు ఐదుగురు మృత్యువాతపడ్డారు. విజయనగరం జిల్లాలో నలుగురు , విశాఖ జిల్లాలో ఒకరు మృత్యువాత పడ్డారు.
వర్షాల కారణంగా కోట్లాది రూపాయాల ఆస్థినష్టం వాటిల్లింది. ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం పుసులూరులో పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు ఉరుముల శబ్దానికి తాడికొండ మండలంలో కశమ్ కుమారి(55) అనే మహిళ గుండెపోటుతో మృతి చెందారు.
బెల్లంకొండ మండలం వెంకటాయపాలెంలో పిడుగుపాటుకు ఇద్దరు మృతిచెందారు. వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడు గ్రామంలో పొలం నుంచి తిరిగి వస్తుండగా పిడుగుపడి వేజెండ్ల రత్నకుమారి(40) చనిపోయారు. సత్తెనపల్లి మండలం, పెదమక్కెనలో గుంటుపల్లి గోపి(26) పిడుగుపాటుకు మృతి చెందారు.
రాజుపాలెం గ్రామంలో గేదెల కాపరి జె.గోపి అనే పిల్లవాడిపై పిడుగు పడి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సత్తెనపల్లి నియోజకవర్గంవ్యాప్తంగా ఈదురు గాలులకు 8 పూరిళ్లు, రేకుల షెడ్లు నేలకూలాయి. పెదకాకాని మండలం వెనిగండ్లలో పిడుగుపాటుకు ఇద్దరు గొర్రెల కాపరులు పసుపులేటి శ్రీనివాసరావు, తోట అంకమ్మరావులకు తీవ్ర గాయాలయ్యాయి.
ఏపీ రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు ఉత్తరాంధ్ర, కృష్ణా, గుంటూరు, ప్రకాశంలో వర్షాలు పడ్డాయి. పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్థంబాలు కూలాయి. దీంతో రాకపోకలకు అంతరాయమేర్పడింది. వర్షం కారణంగా చేతికొచ్చిన పంట తడిసిపోయింది.