ఒంటిమిట్ట రాములోరి కళ్యాణంలో అపశృతి: నలుగురు మృతి
కడప: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శ్రీరామ నవమి వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఈ వేడుకలను చూడటానికి వచ్చిన నలుగురు భక్తులు మృత్యువాత పడ్డారు. మరో 50మంది భక్తులు గాయాలపాలయ్యారు. ఈదురు గాలులు, వడగండ్ల వర్షం కురుస్తుండటంతో నవమి వేడుకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
వడగండ్ల ధాటికి..
కాగా, ఆలయం వద్ద ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన పడుతుండటంతో ఆలయ సమీపంలో ఉన్న చెట్టు నేలకొరిగింది. ఈదురు గాలుల ధాటికి విద్యుత్ షార్ట్సర్క్యూట్ కావడంతో బద్వేలుకు చెందిన చిన్న చెన్నయ్య తోపాటు మరో ముగ్గురు మృత్యువాత పడ్డారు. అన్నదాన సత్రం వద్ద మరో మహిళ గుండెపోటుతో మరణించింది. ఆలయానికి ఎదురుగా ఉన్న రేకుల షెడ్ గాలికి ఎగిరిపడి బోయినపల్లికి చెందిన భాస్కర్, నందలూరుకు చెందిన ధనుంజయ్ నాయుడులకు స్వల్పగాయాలయ్యాయి.
ఇబ్బందులు పడ్డ భక్తులు
భారీ వర్షం కురుస్తుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో పక్కనే ఉన్న హరిత హోటల్కు వద్దకు చేరుకుంటున్నారు. బలమైన గాలుల వీస్తుండంతో అక్కడ ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు, టెంట్లు చెల్లా చెదరుయ్యాయి. కళ్యాణం వీక్షించడానికి వచ్చిన వేలాది భక్తులు వర్షం ధాటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా, కాసేటికి వర్షం తగ్గడంతో భక్తులు తిరిగి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు.
పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు
కోదండరాముడి వేడకల్లో పాల్గొనేందుకు కడప చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ వర్షం కారణంగా ఆర్ అండ్ బీ అతిథి గృహంలో కాసేపు బస చేస్తున్నారు. అనంతరం ఆయన ఆలయం వద్దకు చేరుకుని పట్టువస్త్రాలు సమర్పించారు.
చంద్రుడి సాక్షిగా వైభవంగా వేడుకలు
కడప జిల్లా ఒంటిమిట్టలో కోదండరాముడి కళ్యాణం కన్నుల పండువగా కొనసాగుతోంది. రామ నామస్మరణతో కల్యాణ వేదిక పరిసరాలు మార్మోగుతున్నాయి. కాగా, మామూలుగా అగ్నిసాక్షిగా వివాహం జరిగిందంటారు. కానీ, చంద్రుడి సాక్షిగా రాములోరి కల్యాణం జరగడం ఒంటిమిట్టలో ప్రత్యేకత. కన్నుల పండువగా జరుగుతోన్న ఈ కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తజనం తరలివచ్చారు.