ఏపీలో దంచికొడుతున్న వర్షాలు- సీమ జిల్లాల్లో కుండపోత- పంటలకు భారీనష్టం...
ఏపీని వర్షాలు ముంచెత్తుతున్నాయి. రుతుపవనాల ప్రభావంతో పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో కోస్తాంధ్రతో పాటు రాయలసీమలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు నమోదవుతున్నాయి. నిన్న ఉదయం ప్రారంభమైన వర్షాలు మరో రెండు రోజుల పాటు కొనసాగుతాయని వాతావరణశాఖ ప్రకటించింది. ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో పలు జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. రాకపోకలపై తీవ్ర ప్రభావం పడుతోంది. పంటలకు కూడా భారీ నష్టం వాటిల్లుతోంది. దీంతో అన్నదాతలకు నిరాశ తప్పడం లేదు. భారీవర్షాలకు కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహం కూడా పెరుగుతోంది.
Recommended Video
ఏపీలో వర్షాలే వర్షాలు...
ఏపీలో ఈ ఏడాది ఇప్పటికే సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఇలాంటి పరిస్ధితుల్లో మరోసారి భారీ వర్షాలు రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయి. వర్షాల కారణంగా విజయవాడ, విశాఖతో పాటు పలు ప్రధాన నగరాలు, పట్టణాల్లో జనజీవనంపై తీవ్ర ప్రభావం పడుతోంది. పలుచోట్ల రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. నిన్న విజయవాడ, ఏలూరు, కాకినాడ, కడప, ఒంగోలు, కర్నూల్లో భారీవర్షాలు పడ్డాయి.
కృష్ణాజిల్లా బాపులపాడులో ఏకంగా 125 మి.మీ వర్షం కురియగా.. గుంటూరు జిల్లా పిట్టలవాని పాలెంలో 100 మి.మీ వర్షం పడింది. రాయలసీమలోని కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లోనూ వర్షాలు ముంచెత్తుతున్నాయి. చిత్తూరు జిల్లా పుత్తూరులో ఏకంగా 110 మి.మీ వర్షం పడింది. ఇవాళ, రేపు కూడా వర్షాలు కొనసాగనున్నాయి.
నిండుకుండల్లా రిజర్వాయర్లు..
రాయలసీమతో పాటు కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో రాకపోకలపై పలు చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాష్ట్రంలోని పలు రిజర్వాయర్లు నిండు కుండలను తలపిస్తున్నాయి. కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టుల్లో భారీగా నీరు చేరుతోంది. దీంతో అధికారులు కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి మట్టం భారీగా పెరుగుతోంది. అలాగే గోదావరి ప్రాజెక్టుల్లోనూ నీటి ప్రభావం పెరిగింది. దీంతో ధవళేశ్వరం వద్ద గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలయ్యే పరిస్ధితి ఉంది.
పంటలకు భారీ నష్టం....
ఇప్పటికే ఈ సీజన్లో పలుమార్లు కురిసిన భారీవర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లగా మరోసారి వర్షాలతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో ఈసారి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుంతోందని అంచనా వేస్తున్నారు. ఇటు కోస్తాంధ్రలోనూ పరిస్ధితి దాదాపు అలాగే ఉంది. వరుస వర్షాలతో ఈసారి పంటలు చేతికొస్తాయా లేదా అన్న అనుమానాలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటికే వేల ఎకరాల్లో వేసిన పంటలు వర్షం కారణంగా నీట మునిగాయి. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పరిస్ధితి ఎలా ఉంటుందో అని రైతులు ఆందోళన చెందుతున్నారు.