బెజవాడలో భారీ వర్షం...తడిసి ముద్దయిన కనక దుర్గమ్మ భక్తులు
విజయవాడ:ఒక్కసారిగా విరుచుకుపడ్డ భారీ వర్షంతో విజయవాడ నగరం తడిసి ముద్దయింది. ఎడతెరపి లేకుండా అరగంట పాటు ఆగకుండా కురిసిన వానతో ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు.
కొండమీదకు ఏర్పాటుచేసిన మూడు కిలోమీటర్ల మేర క్యూలైన్ల లో కిక్కిరిసి వున్న భక్తులు ఈ అనూహ్య వర్షంలో నిలువునా తడిసిపోయారు. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో కొండ పైన పరిస్థితి తలుచుకొని అధికారులు ఆందోళన చెందారు. పైగా అమ్మవారికి దర్శనానికి కుటుంబాలకు కుటుంబాలే తరలిరావడంతో చిన్నపిల్లలు, వృద్దులు వాన ధాటికి ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
ఏకధాటిగా వర్షం...తడిసి ముద్దయిన భక్తులు
అలా ఏకధాటిగా అరగంట పాటు కురిసిన వర్షం తరువాత ఎట్టకేలకు తెరపి ఇవ్వడంతో ముందు భక్తులు, ఆ తరువాత అధికారులు ఆందోళన తగ్గి ఊపిరి పీల్చుకున్నారు. కొండ మీద ఒక్క సారిగా భారీ వర్షం ఏకధాటిగా కురవడం వల్ల కొండచరియలు జారిపడటం వంటి వివిధ రకాల ప్రమాదాలకు అవకాశం ఏర్పడుతుందని, అయితే అలాంటి పరిస్థితులు తలెత్తకముందే వర్షం నిలిచిపోవడం ఊరట నిచ్చిందన్నారు.
ఎట్టకేలకు...నిలిచింది
పైగా వర్షం ఇలాగే కొనసాగితే విద్యుత్ సరఫరాను వర్షం తగ్గే వరకు నిలిపి వేయాల్సిన పరిస్థితి ఏర్పడేదని...ఫలితంగా భక్తులు మరింత అసౌకర్యం ఎదుర్కోవాల్సి వచ్చేదని, అయితే ఆ పరిస్థితి తప్పిపోయిందన్నారు. మరోవైపు భక్తులు కూడా అమ్మవారి దయవల్లే వాన నిలిచిపోయిందని...ఆపద నుంచి ఆ తల్లి ఎప్పుడూ కాపాడుతుందన్నారు.
ఆరోరోజు...అన్నపూర్ణాదేవిగా అమ్మ
అంతకుముందు ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్న క్రమంలో ఆరో రోజైన సోమవారం కనకదుర్గ అమ్మవారు అన్నపూర్ణ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. సకల జీవరాశికి ఆహారం ప్రసాదించే అన్నపూర్ణ దేవి అలంకారాన్ని చూసేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఓ చేతిలో అక్షయపాత్ర, మరో చేతిలో గరిట పట్టుకుని ప్రజల ఆకలి దప్పులను తీర్చే తల్లిగా అన్నపూర్ణ దేవి రూపం కన్నులారా వీక్షించి భక్తులు ఆనందపారవశ్యంలో మునిగిపోయారు.
ఆదివారం...3 లక్షలమంది భక్తులు
ఆదివారం మూల నక్షత్రం కావడంతో సరస్వతి దేవి అలంకరణలో ఉన్న దుర్గమ్మను సుమారు మూడున్నర లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆదివారంతో పోలిస్తే సోమవారం భక్తుల రద్దీ కొంత తక్కువగానే ఉంటుందన్నారు. కొండపై ఉన్న క్యూలైన్లలో మాత్రమే భక్తులు కనిపిస్తున్నారు. రద్దీ తగ్గినా పోలీసుల ఆంక్షలు సడలించకపోవంతో ఇబ్బందులు పడుతున్నామని భక్తులు చెబుతున్నారు. ఇలా రద్దీ లేకపోయినా ఆంక్షలు విధించడంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.