అల్పపీడనం:ఏపీలో భారీ వర్షాలు-ఈసారి అధిక వర్షపాతం-ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ సర్వే - కీలక ఆదేశాలు
గడిచిన వారం రోజులుగా భారీ వర్షాలు, వరదలతో సతమతం అవుతోన్న ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు రోజులపాటు వానలు విస్తారంగా కురుస్తాయన్న వాతావరణ శాఖ.. ఈసారి వర్షపాతం అత్యధిక స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం ఆఘమేఘాల మీద నిర్వహణ చర్యలు చేపట్టింది. వర్షాలు, వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించి, అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు.
క్రిస్మస్ నాటికి చెదపురుగులు నాశనం-జగన్కు మోదీ మద్దతు వట్టి సొల్లు - ఎంపీ రఘురామ షాకింగ్ కామెంట్స్
ఏపీ.. బీ అలెర్ట్..
దక్షిణ కోస్తాంధ్ర తీరానికి సమీపంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 1.5 కి.మీ. ఎత్తు వరకూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీనికితోడు తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఈ రెండిటి కారణంగా ఏపీ అంతటా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సోమవారం తెలిపింది. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, సముద్రంలో అలల ఉధృతి పెరిగి, తీరం వెంట 45 కి.మీ నుంచి 55 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
సీఎం ఏరియల్ సర్వే..
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బ తిన్న ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. నందిగామ, అవనిగడ్డ, పెనమలూరు, మైలవరం, తాడికొండ తదితర నియోజకవర్గాల పరిధిలోని ముంపు ప్రాంతాలను, దెబ్బ తిన్న వ్యవసాయ, ఉద్యాన పంటలను ఆయన పరిశీలించారు. భారీ వరదల వల్ల లంక భూములు, నదీ పరీవాహక ప్రాంతాల్లో ఇరువైపులా తీవ్రంగా దెబ్బ తిన్న పంటలను కూడా పరిశీలించారు. ఏరియల్ సర్వేలో సీఎం వెంట మంత్రులు మేకతోటి సుచరిత, కొడాలి నాని ఉన్నారు.
తక్షణ సాయానికి జగన్ ఆదేశం
రెండు జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టిన అనంతరం వివిధ శాఖల అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లాల్లో భారీ వరదలు, వర్షాలు వల్ల తీవ్రంగా దెబ్బ తిన్న ప్రాంతాల్లో పంట నష్టంపై వెంటనే అంచనాలు పూర్తి చేయాలని, వీలైనంత వేగంగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే.. రైతులకు రబీలో పంట పెట్టుబడికి ఉపయోగపడుతుందని సీఎం అన్నారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణ, గుంటూరు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే 5రకాల నిత్యావసర సరుకులతో ప్రభుత్వం ఉచిత రేషన్ అందిస్తున్నదని సీఎంకు అధికారులు వివరించారు. మిగిలిన జిల్లాల్లో కూడా వరదల్లో మునిగిన పంటలతో పాటు, ఇళ్లు, పశువులు నష్టపోయిన వారిని గుర్తించి వెంటనే పరిహారం ఇవ్వాలని మంత్రులు, అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
చైనా దూకుడుకు చెక్:భారత్ కూటమిలో ఆస్ట్రేలియా - మలబార్ విన్యాసాలకు ఆసీస్ నౌకాదళం