ఏపీలో భారీ వర్షం: సచివాలయంలోకి నీళ్లు, జగన్ ఛాంబర్ వద్ద పోలీసులు, రోడ్లు జలమయం, విద్యుత్ అంతరాయం
అమరావతి: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం కూడా ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. గత రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో కృష్ణా, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాలతోపాటు పలు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో విద్యుత్ సరఫరాకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతోంది.
భారీ వర్షానికి రోడ్లపైకి నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కృష్ణా జిల్లాలోని నూజివీడు, తిరువూరు, పెడనలలో గురువారం భారీ వర్షం కురిసింది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ద్వారా కృష్ణా జిల్లాకు పిడుగు హెచ్చరికలు చేసిన నేపథ్యంలో మచిలీపట్నం, పెడన, గుడూరు, చల్లపల్లి, గుడ్లవల్లేరు, పామర్రు, మైలవరం, జి.కొండూరు, అగిరిపల్లి.. మండలాల్లో పిడుగుల పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందాలని కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. కాగా, విశాఖ జిల్లాలో గురువారం తెల్లవారుజాము నుంచి కుండపోత వర్షం కురిసింది. భీమిలి, పద్మనాభం, పాడేరు ప్రాంతాలు భారీ వర్షాలతో జలమయమయ్యాయి. విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఏజెన్సీ ప్రాంతలైన జియ్యమ్మవలస, కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాల్లోని పలు గ్రామాల్లో కురిసిన వర్షాలతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
ఇది ఇలా ఉండగా, భారీ వర్షం కారణంగా మరోసారి ఏపీ సచివాలయంలోకి వర్షపు నీరు చేరింది. భవనాలు పూర్తిగా తడిసిపోవడంతో అక్కడక్కడ సీలింగ్ ఊడిపోయి నీరు కార్యాలయంలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. మున్సిపల్ మంత్రి నారాయణ ఛాంబర్ లో సీలింగ్ దెబ్బతినడంతో సిబ్బంది ఛాంబర్ తలుపులు మూశారు. ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఛాంబర్లోకి ఇప్పటికే నీరు చేరిన విషయం తెలిసిందే. కాగా, సచివాలయం వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. అటువైపు ఇతరులను వెళ్లకుండా, ఫొటోలు, వీడియోలు తీయకుండా అడ్డుకుంటున్నారు.