బంగాళాఖాతంలో అల్పపీడనం: వాయుగుండంగా?: ఏపీలో నాలుగు రోజుల పాటు మరిన్ని వర్షాలు
విశాఖపట్నం: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఉపరితలం నుంచి ఏడున్నర కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఈ అల్పపీడనం క్రమంగా బలపడే అవకాశాలు ఉన్నాయి. దీని ప్రభావంతో నాలుగు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల ఇప్పటికే అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం వంటి జిల్లాల్లో భారీగా వర్షాలు కురిశాయి. నైరుతి రుతుపవానాలకు అల్పపీడనం తోడు కావడం వల్ల భారీ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేస్తున్నారు.
కోవిడ్ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం: ఎనిమిది మంది సజీవ దహనం: 40 మందికి పైగా తరలింపు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారుతోందని అధికారులు అభిప్రాయపడ్డారు. దీని ప్రభావంతో వచ్చే ఆదివారం వరకూ భారీ వర్షాలు పడొచ్చని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలోని విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లా తీర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు నమోదు అయ్యాయని, అదే పరిస్థితి మరో నాలుగు రోజుల పాటు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.
అల్పపీడన ప్రభావంతో గురు, శుక్రవారాల్లో కోస్తా తీర ప్రాంత జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఒడిశా ఉత్తర ప్రాంతం, పశ్చిమ బెంగాల్ తీరాలను ఆనుకొని వాయవ్య దిశగా బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని, ఇది మరింత బలపడొచ్చని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో కోస్తా తీరం వెంట భారీ ఈదురు గాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉండొచ్చని పేర్కొన్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు.
బంగాళాఖాతం పశ్చిమబెంగాల్ తీరంలో మంగళవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉత్తర బంగాళాఖాతంలో 7.6 కి.మీ. ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. బుధవారం అల్పపీడనం మరింత బలపడి, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నిన్న రాష్ట్రంలోని పలుచోట్ల వానలు కురిశాయి. ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు, సిర్పూర్లో అత్యధికంగా 9 సెం.మీ., మంచిర్యాల జిల్లా భీమినిలో 6 సెం.మీ. మణుగూరులో 5 సెం.మీ., చెల్పూరు (జయశంకర్ జిల్లా)లో 2.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
Recommended Video
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఏడున్నర కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన మరో అల్పపీడనం ప్రస్తుతానికి స్థిరంగానే ఉన్నప్పటికీ.. అది క్రమంగా తన దిశను మార్చుకోవచ్చని చెబుతున్నారు. క్రమంగా నైరుతి దిశకు కదులొచ్చని అంచనా వేస్తున్నారు. భూఉపరితలం నుంచి ఏడున్నర కిలోమీటర్ల ఎత్తు వరకు ఉండట వల్ల విస్తరించడానికి అవకాశం ఉందని, అదే జరిగితే బలహీనపడుతుందని అంచనా వేస్తున్నారు. స్థిరంగా కొనసాగితే మాత్రం వాయుగుండం రూపుదాల్చవచ్చని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.