కర్నూలులో వర్షబీభత్సం ... అపార పంట నష్టం .. జనజీవనం అస్తవ్యస్తం
గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కర్నూలు, కడప జిల్లాలను అతలాకుతలం చేస్తున్నాయి. భారీవర్షాల ధాటికి కర్నూలు జిల్లా విలవిల్లాడుతోంది. కర్నూలు జిల్లాను ముంచెత్తిన వరద తో అపార పంట నష్టం జరిగింది. రైతన్నలు ధారాపాతంగా కురుస్తున్న వర్షంతో నీట మునిగిన పంటను చూసి కన్నీటి పర్యంతం అవుతున్నారు.
కర్నూలు జిల్లాలో 40వేల హెక్టార్లలో రూ.43.41 కోట్లు పంట నష్టం
కర్నూలు జిల్లాలో 19 మండలాల్లోని దాదాపు 40వేల హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. వరి, వేరుశనగ, పత్తి, మొక్కజొన్న, మినుము, పెసలు వంటి వ్యవసాయ పంటలతో పాటు ఉద్యాన పంటలైన అరటి, ఉల్లి, టమోటా, కూరగాయల సాగు సైతం నీటమునిగాయి. పంట నష్టం రూ.43.41 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆరుగాలం శ్రమించిన పంట చేతికి రాక కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి రూ.20వేల చొప్పున పెట్టుబడి పెట్టిన రైతులు మాత్రం సుమారు రూ.155 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని వాపోతున్నారు.
దెబ్బతిన్న రహదారులు .. మరమ్మత్తుకు రూ.390.97కోట్ల అంచనా
ఇక వరద ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద తాకిడికి రహదారులు కొట్టుకుపోయాయి. జనజీవనం అస్తవ్యస్తంగా తయారైంది. 56 ప్రాంతాల్లోని 561 కిలోమీటర్లకు పైగా రోడ్లు ధ్వంసమవడంతో రాకపోకలు స్తంభించాయి. పలు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి . దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద తాకిడికి దెబ్బతిన్న రోడ్లను శాశ్వత మరమ్మతులను చేయడానికి దాదాపు రూ.390.97కోట్లకు పైగా అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు.
శ్రీశైలం డ్యాం కు పెరిగిన వరద ... నాలుగు గేట్లు ఎత్తి నీరు విడుదల
ఇక భారీ వర్షాలు, ఎగువ నుండి వస్తున్న వరద కారణంగా శ్రీశైలం డ్యాంకు వరద పెరిగింది. జలాశయానికి ప్రవాహం తగ్గడంతో గత సోమవారం క్రస్ట్గేట్లను మూసివేసిన అధికారులు భారీ వరద మళ్లీ మొదలవడంతో మొత్తం నాలుగు గేట్లు ఎత్తి సాగర్కు నీరు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, నీటినిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు. కాగా, గురువారం సాయంత్రం 7గంటలకు 884.90 అడుగుల వద్ద 215.3263 టీఎంసీల నిల్వ నమోదయినట్టుగా అధికారులు చెప్తున్నారు.
ఇంకా కురుస్తున్న వర్షాలు .. మునిగిన నల్లమల బేస్ క్యాంపులు
ఇక గురువారం సైతం కర్నూలు కడప చిత్తూరు జిల్లాలో భారీ వర్షం కురిసింది. చిత్తూరు జిల్లాల్లో 8 మండలాల్లో 100 మిల్లీ మీటర్లను మించి వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. నల్లమల అడవుల్లో ప్రభుత్వం ఏర్పాటుచేసిన బేస్ క్యాంపులను వరద ముంచెత్తింది . దీంతో ప్రొటెక్షన్ వాచర్లు, ఇతర సిబ్బంది అవస్థలు పడుతున్నారు. చలమ, నంద్యాల, జీబీఎం రేంజ్లోని 11 బేస్ క్యాంపులలో ఏడుచోట్ల దాదాపు ఇదే పరిస్థితి ఉంది. ఇక ప్రాజెక్టులన్నీ జలకళతో కళకళలాడుతున్నప్పటికీ భారీగా కురుస్తున్న వర్షాలతో, వరద ముంపుకు గురైన ప్రాంతాలలో ప్రజలు మాత్రం విలవిలలాడుతున్నారు.