కరవు సీమలో జల హోరు: పదుల సంఖ్యలో జలపాతాలు..పోటెత్తుతున్న పర్యాటకులు!
కడప: కరవుకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రాయలసీమ ఈ సారి జలకళను సంతరించుకుంది. గతంలో ఎప్పుడూ లేనంత భారీ వర్షాలు, వరదలతో సరికొత్త అందాలను సంతరించుకుంది. తడారిపోయి, కనుమరుగైన నదులు సైతం ఈ సీజన్ లో తమ ఉనికిని చాటుకున్నాయి. వర్షాలు, వరదలతో జీవకళను నింపుకొన్నాయి. ఒక్క భారీ వర్షం కురిస్తే చాలనుకునే అనంతపురం, కర్నూలు జిల్లాల రైతులు. అలాంటిది.. ఈ సారి వరుసగా కురిసిన భారీ వర్షాలు, వరదలకు ఉప్పొంగిపోతున్నారు. మరో రెండేళ్ల వరకూ సాగుకు బెంగ ఉండదని ఆశిస్తున్నారు.
ఈ సారి కురిసిన భారీ వర్షాలతో రాయలసీమ ఓ సరికొత్త కళను సంతరించుకుంది. కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోని దాదాపు అన్ని చెరువులూ నిండిపోయాయి. అన్ని చిన్న, మధ్య తరహా రిజర్వాయర్లు గరిష్ఠ స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. ఈ వర్షాల వల్ల ఈ నాలుగు జిల్లాల్లోనూ జలపాతాలు ఏర్పడ్డాయి.
ఒకటి కాదు.. రెండు కాదు.. పదుల సంఖ్యలో జలపాతాలు సీమ జనాలను కట్టి పడేస్తున్నాయి. ఊపిరి బిగబట్టేలా చేశాయి. ఎన్నో ఏళ్లుగా కాలగర్భంలో కలిసిపోయి, చినుకులకు గతిలేక మోడువారిన జలపాతాలు తమ పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయి.
అనంతపురం జిల్లాలో యాడికి, కర్నూలులో అహోబిళం, అవుకు, కడప జిల్లాలో నిత్యపూజస్వామి కోన, ఇడుపుల పాయ, పెండ్లిమర్రి, చిత్తూరు జిల్లాలో తలకోన, కపిలతీర్థం వంటి ప్రదేశాల్లో జలపాతాలు తమ పూర్వస్థితికి చేరుకున్నాయి. అనంతపురం జిల్లా యాడికి గ్రామానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉప్పలపాడు జలపాతం పోటెత్తింది. ఉప్పలపాడు జలపాతం వరకూ వాహనాలు వెళ్లడానికి అవకాశం ఉంది. సుమారు 30 అడుగుల ఎత్తు నుంచి కిందికి దూకుతోన్న ఈ జలపాతాన్ని చూడటానికి సందర్శకులు బారులు తీరుతున్నారు. దసరా సెలవులు తోడు కావడం.. ఆయా ప్రాంతాలన్నీ పర్యాటకులతో నిండిపోతున్నాయి.