భారీ వర్షాలు...అర్థరాత్రి హెచ్చరికల ఫోన్లు:ప్రజల ఆందోళన
అమరావతి:భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలంటూ అర్థరాత్రి సమయంలో ప్రభుత్వ అధికారుల నుంచి ఫోన్లు రావడంతో ప్రజలకు భయాందోళనలకు లోనయ్యారు.
ఆ సమయంలో హఠాత్తుగా ఫోన్లు రావడంతో ఎక్కడైనా ఏమైనా జరిగిందా?...లేక ఏదైనా ముప్పు ముంచుకొచ్చే అవకాశం ఉందా?...అని పరివిధాల చర్చించుకుంటూ కలత చెందినట్లు తెలిసింది. అయితే ఇలా ఆ సమయంలో కాల్స్ రావడంపై ఆరా తీయగా అవి రియల్ టైం గవర్నెన్స్ నుంచి ప్రజలకు వెళ్లిన వాయిస్ రికార్డ్ కాల్స్ గా తెలిసింది. అయినా అలా అర్థరాత్రి సమయంలో కాల్స్ వెళ్లకుండా అధికారులు జాగ్రత్త వహించాల్సిందని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.
భారీ వర్షాల కారణంగా అప్రమప్తంగా ఉండాలంటూ కూనవరం, చింతూరు, వీఆర్ పురం ప్రజలకు అధికారుల నుంచి ఫోన్ కాల్స్ రావడంతో ఆయా గ్రామాలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందారు. ఆఅందులోనూ ఆ కాల్స్ అర్థరాత్రి సమయంలో రావడం వారిని మరింత భయాందోళనలకు గురి చేసింది. ఇలా కాల్స్ అందుకున్న అత్యధికులు ఏం జరిగుంటుందోనని చర్చించుకున్నారు.
ఏదైనా జరిగే ఉంటుందని...లేనిపక్షంలో ఇంత అర్థరాత్రి సమయంలో ప్రత్యేకంగా ఫోన్లు ఎందుకొస్తాయని కుటుంబ సభ్యులు చర్చించుకున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని అలా రాత్రంతా సరిగ్గా నిద్ర కూడా పోలేదని ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు. అంతకుముందు ఆదివారం రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్లో సమీక్షించారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని, వారికి ఆహారం, నీరు వంటి కనీస వసతులు కల్పించాలని సిఎం చంద్రబాబు సూచించారు. విపత్తు నిర్వహణ శాఖ, రియల్ టైమ్ గవర్నెన్స్ సూచనలకనుగుణంగా సమన్వయంతో పని చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదపుటంచున ఉన్న వంతెనలపై ప్రయాణించకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని, కూలిపోయి, కొట్టుకుపోయిన వంతెనలకు ప్రత్యామ్నాయం లేదా పునర్నిర్మాణం వంటి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవనిగడ్డలో పాము కాట్లకు గురైన బాధితులకు తక్షణ మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. కుంభవృష్టిగా వర్షాలు కురుస్తున్న కృష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.