ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు: ఐదుగురు మృతి, ఎగిసిపడుతున్న అలలు
విశాఖపట్నం: ఉత్తరాంధ్రలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. రోజూ ఎండలు మండిపోతుండగా మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఉరుములు.. పిడుగులతో భారీ వర్షం కురిసింది. కాగా, వర్షాల కారణంగా విజయనగరం జిల్లాలో నలుగురు, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు మృతి చెందారు.
విశాఖతీరంలోని సముద్ర అలలు ఎగసిపడుతున్నాయి. భారీగా అలలు ఎగిసిపడే అవకాశముందన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో విశాఖతీరంలో సముద్ర స్నానాలు నిలిపివేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. విశాఖలో మంగళవారం సాయంత్రం సుమారు అరగంట పాటు భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. రహదారులు జలమయమయ్యాయి. మధ్యాహ్నం నుంచి ఆకాశంలో దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. మేఘాల ప్రభావంతో వెలుతురు బాగా తగ్గి పట్టపగలే వాతావరణం చీకటిగా మారింది.
విజయనగరం జిల్లాలో భారీవర్షంతో పాటు పిడుగులు పడి నలుగురు మృతి చెందారు. భోగాపురం మండలం రాజపులోవ గ్రామానికి చెందిన రామాయమ్మ(50) తన మనువరాలు శ్రావణి(10)ని తగరపువలసలోని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా పిడుగుపడి ఇద్దరూ మృతి చెందారు. పూసాపాటిరేగ మండలం రెల్లివలసకు చెందిన పశువుల కాపరి రౌతు గిరినాయుడు పిడుగుపడి మృతచెందాడు. తెర్లాం మండలం సుందరాడకు చెందిన ఆదినారాయణ భారీ వర్షం వస్తున్న సమయంలో ఇంటికి వస్తూ పిడుగుపాటుకు గురై మృతి చెందాడు.
శ్రీకాకుళం జిల్లాలోని వీరఘట్టం, పాలకొండ, రాజాం, భామిని, కోటబొమ్మాళి, టెక్కలిలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వీరఘట్టం మండలం పనసనందివాడలో పిడుగుపడి దుర్గారావు అనే వ్యక్తి మృతి చెందాడు.