కోస్తా,తెలంగాణాల్లో...రాగల 24 గంటల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం!
విశాఖపట్నం:రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తా-ఉత్తర తెలంగాణకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు గురువారం వెల్లడించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒడిశా తీరంపై భువేనేశ్వర్కు ఆగ్నేయంగా 30 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందన్నారు. దీని ప్రభావంతో కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయని చెప్పారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.
శ్రీశైలానికి...పోటెత్తిన వరద
మరోవైపు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తింది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జాలాశయాలు పూర్తిగా నిండిపోవడంతో నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాలకు వరద పోటెత్తడంతో గేట్లు ఎత్తి 64500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పవర్ హౌజ్ ద్వారా మరో 48వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే సుంకేశుల నుంచి 1,39,451 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు మొత్తం 251961 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో గా ఉంది.
జూరాల...గేట్లు ఎత్తివేత
ఎగువన కురుస్తున్న వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు మళ్లీ వరద ఉధృతి భారీగా పెరిగింది. మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు తెలంగాణలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో జూరాలకు 1,10,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు నీటిమట్టం దాదాపు 318 మీటర్లకు చేరుకోవడంతో 11 గేట్లు ఎత్తేశారు. అంతేకాదు ఆరు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. మరోవైపు లక్షా7వేల క్యూసెక్కుల నీటిని శ్రీశైలంవైపు విడుదల చేస్తున్నారు.
సుంకేసుల...నిండుకుండ
అలాగే కర్నూలు సుంకేసుల డ్యాంకు వరద ప్రవాహం అధికంగా ఉండటంతో నిండుకుండలా మారింది. అధికారులు డ్యాం 18 గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం డ్యాం ఇన్ఫ్లో లక్షా నలబై వేలు కాగా ఔట్ఫ్లో లక్షా 38 వేల క్యూసెక్కులుగా ఉంది. అటు కేసీ కేనాల్కు రెండు వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు.
గోదావరి...పెరుగుతోంది
ఎగువ ప్రాంతాలైన గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాబోయే 24 గంటల పాటు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టాలు మరింత పెరగనున్నాయని సిడబ్ల్యుసి అధికారులు గురువారం తెలిపారు. సిడబ్ల్యుసి అధికారులు మాట్లాడుతూ...భద్రాచలంలో ప్రస్తుత గోదావరి నీటిమట్టం 32.7 అడుగులు ఉందన్నారు. రేపు మధ్యాహ్నానికి కానీ, ఈ రోజు రాత్రికి కాని భద్రాచలం వద్ద గోదావరి మొదటి ప్రమాద హెచ్చరికగా నీటిమట్టం 43 అడుగులకు చేరుకునే అవకాశం ఉందని చెప్పారు.