భారీ వర్షాలతో 4గురు మృతి: వరదలతో ఎక్కడికక్కడే నిల్చిన ట్రాఫిక్, రైళ్లు
విశాఖపట్నం: జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రవాణాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వరద తాకిడితో పలు రైళ్లు కూడా రద్దయ్యాయి. జాతీయ రహదారిపై నీళ్లు చేరడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది.
భారీ వర్షాలు, వరదల కారణంగా తుని రైల్వే స్టేషన్లో రామేశ్వరం-భువనేశ్వర్ రైలు ఆగిపోయింది. అనకాపల్లి, సామర్లకోట రైల్వే స్టేషన్లలోనూ వరద కారణంగా పలు రైళ్లు నిలిచిపోయాయి. మరోవైపు విశాఖ-విజయవాడ మధ్య ప్రయాణించే రత్నాచల్ ఎక్స్ప్రెస్ను అన్నవరం రైల్వేస్టేషన్లో నిలిపివేశారు. పట్టాలపై నీరు తొలగేవరకు రైళ్లను నిలిపివేస్తామని అధికారులు తెలిపారు. విశాఖతోపాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనూ వర్షం కారణంగా జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నక్కపల్లి భారీ వర్షం
నక్కపల్లి మండలంలో భారీ వర్షం పడుతుంది. ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో జానకయ్యపేట, విదుల్లపాలెం, రమణయ్యపేట, బోడిచర్ల తదితర ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటితో నక్కపల్లిలోని రాజీవ్నగర్ కాలనీతో పాటు పశువుల ఆసుపత్రి, అగ్నిమాపక కేంద్రం జల దిగ్భందంలో చిక్కుకున్నాయి. బోడిచర్ల, ఉద్దండపురం ప్రాంతాల్లో వందల ఎకరాల్లో పంట నీట మునిగింది.
విరిగిన కొండచరియ: కూలిన ఇల్లు
జీవీఎంసీ 64వ వార్డు కాళికానగర్లో ఆదివారం కొండచరియ విరిగి ఓ పూరిగుడిసెపై పడింది. దీంతో ఓ మహిళకు గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల కురుస్తున్న వర్షాలకు సుమారు 4 టన్నుల బరువు గల కొండచరియ స్థానికంగా నివాసం ఉంటున్న జొన్నపల్లి రమణమ్మ ఇంటిపై పడింది. దీంతో భయాందోళన చెందిన ఆమె ఒక్కసారిగా కేకలు వేస్తూ.... ఇంట్లోంచి బయటకు పరుగులు పెట్టింది. ఈ ఘటనలో రమణమ్మకు స్వల్పగాయాలయ్యాయి.
బాధితురాలి కుమారుడు లక్ష్మణరావు, కుమార్తె మౌనిక ఆ సమయంలో ఇంట్లో లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సమాచారం తెలుసుకున్న గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, తహసీల్దార్ రవి, ఇతర అధికారులు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. వీఆర్వో అనంతరామయ్య నివేదికను తయారు చేసి ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలిపారు.
భారీ వర్షాలతో నలుగురు మృతి
గత రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వేపాడులో స్లాబ్ కూలిపోవడంతో కర్రి అప్పారావు(70), కర్రి నాగమ్మ(65)లు అక్కడికక్కడే మృతి చెందారు.
ఇది ఇలా ఉండగా, చోడవరం పట్టణంలో దుర్గా కాలనీకి చెందిన కాతారపు ప్రసాద్ (16) అనే యువకుడు ఐదురుగు స్నేహితులతో కలిసి లక్ష్మీపురం చెరువు చూసేందుకు వెళ్లారు. వర్షాలకు చెరువు నీరు బయటకు పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఇద్దరు యువకులు భయపడి ఒడ్డున ఉండిపోయారు. ప్రసాద్తో పాటు మరో ఇద్దరు చెరువులోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, నీటి ఉద్ధృతికి కాలుజూరి వీరంతా నీటిలో కొట్టుకుపోయారు.
అప్రమత్తమైన స్థానికులు అప్పటికే ఈతకొట్టుకుని ప్రాణాలతో ఒడ్డుకు చేరేందుకు ప్రయత్నిస్తున్న ప్రసాద్ స్నేహితులు ఇద్దరిని రక్షించారు. ఈతగాళ్లు వెళ్లి ప్రసాద్ను నీటిలో నుంచి బయటకు తీసుకువచ్చారు. అయితే అప్పటికే ప్రసాద్ చనిపోయాడు. ఘటన గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్. రాజ.. చెరువు వద్దకు వచ్చి యువకుడి మృతదేహాన్ని పరిశీలించి ప్రమాదానికి కారణాలను ఎస్సై మూర్తిని అడిగి తెలుసుకున్నారు.
మృతుడి తండ్రి అప్పారావు చోడవరంలోని రైతుబజారు వద్ద బార్బర్ దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ప్రసాద్ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ప్రసాద్ మృతితో చోడవరం దుర్గా కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి. మరో ఘటనలో బి రవీంద్ర ప్రసాద్ అనే 9వ తరగతి విద్యార్థి ప్రమాదవశాత్తు దుమ్రిగూడ సమీపంలోని చెరువులో పడి మృతి చెందాడు.