రెండు రోజుల పాటు అతి బారీ వర్షాలు..! ఏపిలో మొదలైన "ఫొనీ" ప్రభావం..!!
శ్రీకాకుళం/హైదరాబాద్ : ఉత్తరాంద్ర మరోసారి అతలాకుతలం కానుంది. పెను తుపాను ఫొని ప్రభావం మొదలైంది. శ్రీకాకుళం జిల్లాలోని సముద్ర తీర మండలాల్లో పరిస్థితులు మారుతున్నాయి. పలాస, టెక్కలి, సంతబొమ్మాళి, శ్రీకాకుళంలో భారీ వర్షం కురుస్తోంది. మిగిలిన సముద్ర తీర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడుతున్నాయి. తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా మీదుగా నడిచే పలు రైళ్లు రద్దయ్యాయి. తూర్పు కోస్తా రైల్వే పరిధిలోని మొత్తం 103 రైళ్లను అధికారులు రద్దు చేసిన విషయం తెలిసిందే..!
శ్రీకాకుళంలో భారీ వర్షాలు..! అప్రమత్తమైన యంత్రాంగం..!!
ఫొని తుపాను నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తుపాను పునరావాస కేంద్రాల్లో పరిస్థితిని కలెక్టర్ నివాస్ ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ఇచ్ఛాపురం, సోంపేట, కవిటి, పలాస, మందస, టెక్కలి, కొత్తూరు, భామిని, శ్రీకాకుళంలో తొమ్మిది ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. అగ్నిమాపక శాఖ బృందాలు, తుపాను ప్రభావిత మండలాల్లో ఐదు జేసీబీలు కూడా ఉంచామన్నారు. మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.
రెండు రోజుల పాటు భారీ వర్షాలు..! లోతట్లు ప్రాంతాల ప్రజలను తరలిస్తున్న అదికారులు..!!
బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఫొని తుపాను అలజడి సృష్టిస్తోంది. ప్రస్తుతం విశాఖ తీరానికి 235 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. శ్రీకాకుళం జిల్లాకు కేవలం 40 నుంచి 50 కిలోమీటర్ల దూరం నుంచే ఒడిశా వైపుగా ప్రయణిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాకు భారీ ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. బంగాళాగాతంలో అతి తీవ్ర తుపాన్గా మారిన ఫొని ప్రభావంతో ఉత్తర శ్రీకాకుళం, తీరప్రాంత శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రెండురోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అతలాకుతలం కానున్న ఉత్తరాంద్ర..! ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రభుత్వం..!!
ఫొని తుపాన్ ప్రస్తుతం కాకినాడ నుంచి తూర్పు ఆగ్నేయ దిశగా 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఉంది. దీని ప్రభావంతో విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. నిన్న సాయంత్రం పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి ఉత్తర ఈశాన్య దిశగా తుపాన్ దిశ మార్చుకుంది. ప్రస్తుతం ఈశాన్య దిశలోనే కదులుతూ గంటకు ఏడు కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. రేపు మధ్యాహ్నం పూరీకి సమీపంలో తీరం దాటనుంది.
తీరం దాటే సమయంలో అలజడి..! ప్రాణనష్టం జరగకుడా జాగ్రత్తలు..!!
తీరం దాటే సమయంలో 200 కిలోమీటర్ల వరకు ప్రచండ గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఫొని తుపానును విశాఖ, మచిలీపట్నం, చెన్నైలోని రాడార్లు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే తీర ప్రాంతంలో పెద్ద ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయి. ఒకటిన్నర మీటర్ల ఎత్తులో అలలు తీరాన్ని తాకుతున్నాయి. తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ముఖ్యంగా ఒడిశాలోని లోతట్టు ప్రాంతాలు భారీగా జలమయమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది.