హెలికాప్టర్ రెక్కల వేగం ఫ్యాన్ గాలికి ఇబ్బందేనా..! ఏపీలో పాల్ వర్సెస్ వైసీపి..!!
అమరావతి/ హైదరాబాద్ : ఎన్నికల సంఘం చేసే కొన్ని పనులు బలమైన రాజకీయపార్టీలకు తీవ్రనష్టాన్ని కలిగిస్తాయి. ఇందుకు చాలా ఉదంతాలు నిదర్శనంగా నిలిచాయి. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కారు గుర్తును పోలిన ట్రక్కు గుర్తు ఓ సాధారణ పార్టీకి కేటాయించడంతో చాలా చోట్ల గులాబీ అభ్యర్థులు ఓటమి అంచుకు చేరి బొటాబొటీ ఓట్లతో గట్టెక్కారు. ఇప్పుడు ఇదే పరిస్థితి ఏపీ ఎన్నికల్లోనూ పునరావృతం కానుందని వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
వైసీపీలో పాల్ గుర్తు చిచ్చు..! హెలికాప్టర్ రెక్కలతో కష్టమే అంటున్న వైసీపి..!!
కేఏపాల్..! ప్రజాశాంతి పార్టీ అద్యక్షుడు. పాక్, భారత్ యుద్ధాన్ని నిలువరించేందుకు ఆయా దేశాల అద్యక్షులతో సంప్రదింపుల కార్యక్రమంలో ఉన్నారు. అదే సమయంలో ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని క్రుత నిశ్చయంతో ఉన్నారు.దీని కోసం ఇప్పటికే ట్రంప్ సహాయం తీసుకున్నారు పాల్.రేపోమాపో ఆయన కూడా ఏపీలో ప్రచారంలో పాల్గొనవచ్చు. పాల్ ఏది మాట్లాడినా సంచనలమే.! జబర్దస్త్ కార్యక్రమానికి కు కూడా రాని లైక్లు.. కేఏపాల్ ప్రసంగానికి వస్తున్నాయంటే అర్ధం చేసుకోవచ్చు. పాల్ ఇప్పటి వరకూ చంద్రబాబునాయుడు ఏజెంట్గా అందరూ భావిస్తున్నారు. కానీ తాను మాత్రం ఒంటరిగా రాష్ట్రంలో అధికారంలోకి వస్తానంటూ పాల్ ఏపి రాజకీయాలకు సవాల్ విసురుతున్నారు.
ఎన్నికల సమయం..! గుర్తు గొడవేంటని తలలు పట్టుకుంటున్న వైసీపి నేతలు..!!
అవన్నీ ఒకెత్తు.. ఇప్పుడు మనం ప్రస్తావించేది ఒకెత్తు. ఈ మధ్యనే ప్రజాశాంతి పార్టీకు ఎన్నికల సంఘం గుర్తును కేటాయించింది. అదీ హెలికాప్టర్. దీన్ని జనాల్లోకి బాగా తీసుకెళ్లాలంటూ లక్షలాది పోస్టర్లను సిద్ధం చేస్తున్నారు.. ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది. హెలికాప్టర్ గుర్తులో ఎక్కువగా కనిపించేది పైన తిరిగే రెక్కలే. ఇప్పుడు అవే రెక్కలు, జగన్ వర్గాన్ని గుబులు పుట్టిస్తున్నాయట. వైసీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్. ప్రజాశాంతి పార్టీది హెలికాప్టర్. అక్షరాస్యులకు ఇది తేలికగా అర్ధమవుతుంది. కానీ గ్రామీణ ప్రాంతప్రజలు, వృద్ధులకు రెండింటి మధ్య తేడా గుర్తించటం కష్టమే. అదే వైసీపి శ్రేణులకు అసలు బెంగగా పరిణమించింది.
గ్రామీణ ఓటర్లలో అయోమయం తప్పదు..! ఏంటి కర్తవ్యం అంటున్న వైసీపి..!!
రాబోయే ఎన్నికల్లో పార్టీను గట్టెక్కించేది గ్రామీణ ఓటర్లు, అభిమానులే అనేంత భరోసా వైసీపీలో కనిపిస్తుంది. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిపడిన హెలికాప్టర్ గుర్తు తమ ఓట్లను ఎక్కడ చీల్చుతుందనే బెంగ పట్టుకుందట. పైగా పాల్.. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తానంటున్నారు. ఏమౌతుందిలే అని తేలికగా కొట్టిపారేద్దామంటే.. ముందస్తు ఎన్నికల్లో గులాబీపార్టీ చవిచూసిన అనుభవం కళ్ల ముందు తిరుగుతోంది. టీఆర్ఎస్ పార్టీ గుర్తు కారు. ఇదే ఎన్నికల్లో ట్రక్కు గుర్తుతో మరోపార్టీ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే..!
గుర్తుతో పాల్ కు అనుకూలం..! వైసీపికి ప్రతికూలం..!!
దీంతో కారుకు పడాల్సిన ఓట్లను చాలా వరకూ ట్రక్కు లాగేసుకుంది. ఓడిన టీఆర్ఎస్ అభ్యర్థుల్లో అధికశాతం ట్రక్కు గుర్తు వల్లనే ఓటమి చవిచూశారు. ఉత్తమ్కుమార్ రెడ్డి నియోజకవర్గం హుజూర్నగర్లోనూ ట్రక్కు గుర్తుకు ఐదువేల ఓట్లు పోలయ్యాయి. ఇప్పుడు ఇదే పరిణామం తిరిగి ఏపీలో హెలికాప్టర్, ఫ్యాన్ గుర్తుల మధ్య పునరావృతమైతే బండ్లు ఓడలు..ఓడలు బండ్లు అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.