ఏపీలో మొదలైన 'హెల్మెట్' గోల: పొద్దున్నే వసూళ్లకు దిగిన ట్రాఫిక్ పోలీసులు
అమరావతి: ఏపీలో నవంబర్ 1 (ఆదివారం) నుంచి హెల్మెట్ వాడకం తప్పనిసరి చేస్తూ రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ద్విచక్ర వాహనదారులు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలి. దీంతో రవాణా శాఖ విజయవాడలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తోంది.
ఇందులో భాగంగా హెల్మెట్లు లేని వారికి ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తున్నారు. ఈరోజు నుంచి హెల్మెట్ లేకుండా కనిపిస్తే మొదటి సారి రూ. 100 జరిమానాగా విధిస్తారు. ఆపై రెండోసారి కూడా హెల్మెట్ లేకుండా పట్టుబడితే వాహనాన్ని సీజ్ చేస్తామని వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
హెల్మెట్ గురించి గత నెల రోజులుగా పోలీసులు ప్రజల్లో అవగాహన కల్పించారు. అయితే ప్రజల్లో ఎంత మేరక అవగాహన పెరిగిందో తెలుసుకునేందుకు ఈరోజు ఉదయం హెల్మెట్ లేకుండా రోడ్లపైకి వచ్చిన వారి నుంచి పోలీసులు జరిమానాలు వసూలు చేయడం ప్రారంభించారు.
అయితే, రసీదు రాసి జరిమానాలు వసూలు చేయాల్సిన ట్రాఫిక్ పోలీసులు ఆ పని చేయడం లేదన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. హెల్మెట్ లేని వాహన దారుల నుంచి రూ. 50 లంచం తీసుకొంటున్నారంటూ పలువురు ఆరోపించారు. పొద్దున్నే పనులకు వెళుతుంటే ఈ వసూళ్లేంటని పలు చోట్ల బైకర్లు పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఘటనలు మీడియాలో కనిపిస్తున్నాయి.
ఉన్నతాధికారులు మాత్రం తాము ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని, పోలీసులు రసీదులు రాయకుండా వసూలు చేసినట్టు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. గతంలోనే ఈ నిబంధనను అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నించింది. చివరకు సుప్రీంకోర్టు ప్రభుత్వానికి డెడ్లైన్ విధించడంతో వాహనదారులు హెల్మెట్ వాడటాన్ని ఈరోజు నుంచి తప్పనిసరి చేసింది.