కువైట్లో వారిని ఆదుకోండి: విదేశాంగ మంత్రికి చంద్రబాబు లేఖ
హైదరాబాద్: భారత విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్కు ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ లేఖ రాశారు. కువైట్ నుంచి స్వదేశానికి వచ్చే కార్మికులు జీవనోపాధికి చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. వలస కార్మికుల ఉపాధికి గమ్యస్థానంగా కువైట్ ఉందని తెలిపారు.
కరోనావైరస్ భయాందోళనలతో కువైట్ పూర్తి స్థాయి లాక్డౌన్ ప్రకటించిందని, దీంతో వలస కార్మికులు ఉపాధిని కోల్పోయారని వివరించారు. వలస కార్మికులను స్వదేశానికి పంపించేందుకు కువైట్ సిద్ధంగా ఉందని, దాదాపు 15వేల మంది భారతీయులు ఈ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు.
కువైట్ నుంచి తరలివచ్చే వారి భద్రత, జీవనోపాధి రక్షణ చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రిని కోరారు. స్వదేశానికి చేరిన తర్వాత లాక్డౌన్తో ఇబ్బంది పడకుండా సరైన రవాణా సదుపాయాలు కల్పించి స్వస్థలాలకు చేరేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. స్వదేశానికి వచ్చిన తర్వాత వారికి జీవనోపాధి పునరావసం కల్పించాలని చంద్రబాబు ఆ లేఖలో కోరారు.
ఇది ఇలావుండగా, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా చంద్రబాబు లేఖ రాశారు. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తిస్థాయిలో పింఛను చెల్లించాలని సూచించారు. మార్చి నెలకు సంబంధించి వారికి సగం పింఛనే చెల్లించడం సరైన నిర్ణయం కాదన్నారు. సుదీర్ఘకాలం ప్రభుత్వానికి సేవలందించిన విశ్రాంత ఉద్యోగుల పింఛన్లలో కోతలు విధించడం సరికాదన్నారు.
పెన్షనర్లకు చెల్లించే పింఛనులో ఎలాంటి కోత విధించరాదని చట్టం స్పష్టం చేస్తోందని చంద్రబాబు చెప్పారు. పెన్షన్ అందుకునేవారంతా 60ఏళ్లు పైబడిన వారేనని, వయోభారంతో వచ్చే అనారోగ్య సమస్యలతో వీరికి వైద్య ఖర్చులు కూడా ఉంటాయన్నారు. వెంటనే రిటైర్డ ఉద్యోగులందరికీ 100 శాతం పెన్షన్ చెల్లించాలని ఏపీ సర్కారును డిమాండ్ చేశారు చంద్రబాబు.