హర్ష బుజ్జగింపు: ఎట్టకేలకు నటి హేమ నామినేషన్
రాజమండ్రి: ప్రముఖ సినీ నటి హేమ తూర్పు గోదావరి జిల్లా మండపేట నుంచి జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థిగా శనివారం నామినేషన్ దాఖలు చేశారు. తాను రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్లుగా శుక్రవారం ప్రకటించిన హేమ ఆ తర్వాత నుంచి కనిపించకుండా పోయారు. చివరకు అమలాపురం పార్లమెంటు అభ్యర్థి హర్ష కుమార్ బుజ్జగించడంతో ఆమె నామినేషన్ వేశారు.
కాగా, నటి హేమ మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు నల్లారి కుమార్ రెడ్డికి షాక్ ఇచ్చిన విషయ తెలిసిందే. ఆమె శనివారం కొన్ని గంటల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున తూర్పుగోదావరి జిల్లా మండపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నానని శుక్రవారం ప్రకటించిన కొద్దిసేపటికే ఆమె వెనక్కి తగ్గారు.
తాను పుట్టిన రాజోలు నుంచి పోటీ చేయాలని భావించానని, ఆ స్థానం రిజర్వ్ కావడంతో మండపేటను ఎంచుకున్నానని ఆమె శుక్రవారం మీడియా ప్రతినిధులకు తెలిపారు. ఈ విషయం మీడియా ద్వారా బయటకు రావడంతో పోటీ నుంచి తప్పుకోవాలంటూ చిత్ర పరిశ్రమ ప్రముఖుల నుంచి హేమపై ఒత్తిడి పెగిరినట్లు చెబుతున్నారు. ఒత్తిడి కారణంగా ఆమె శుక్రవారం మధ్యాహ్నం ఆమె అజ్ఞాతంలోకి పోయారు.
చివరికి హేమ తన సెల్ ఫోన్ కూడా స్విచాఫ్ చేసేశారు. అంతకుముందు హేమ హర్ష కుమార్తో కలిసి ర్యాలీలో కూడా పాల్గొన్నారు. రాష్ట్ర విభజనపై కోపంతోనే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు కూడా చెప్పారు. సమైక్యాంధ్ర పరిరక్షణే స్ఫూర్తిగా రాజకీయాల్లోకి వచ్చినట్లు కూడా తెలిపారు. ఏకపక్షంగా రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెసు పార్టీపై కోపంతోనే తాను పోటీ చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఆ తర్వాత హర్షకుమార్ బుజ్జగింపుతో నామినేషన్ దాఖలు చేశారు.