ఆంధ్రప్రదేశ్లో అందరి దృష్టి ఈ నియోజకవర్గాల వైపే..!
ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలకు 25 పార్లమెంటరీ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా...ఈ ఎన్నికల్లో పలు లోక్సభ నియోజక వర్గాలపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఇక్కడ ప్రతిష్టాత్మకంగా కొన్ని పార్లమెంటు నియోజకవర్గాలు కనిపిస్తున్నాయి. అవేమిటో ఆ నియోజకవర్గాల చరిత్ర ఏమిటో ఒక్కసారి చూద్దాం.
వైజాగ్లో చతుర్ముఖ పోటీ
ఆంధ్రప్రదేశ్లో అన్ని నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు జరుగుతోంది. అయితే ఇక్కడ కొన్ని నియోజకవర్గాలపై రాష్ట్ర ప్రజలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ముందుగా విశాఖపట్నం నియోజకవర్గం చూస్తే ఇక్కడ బరిలో దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీ నుంచి పోటీలో ఉండగా... బాలకృష్ణ అల్లుడు శ్రీభరత్ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. మరోవైపు వైసీపీ నుంచి ఎంఎస్ సత్యనారాయణ పోటీలో ఉండగా జనసేన నుంచి లక్ష్మీనారాయణ బరిలో ఉన్నారు. 2009, 2014లో కాంగ్రెస్ అభ్యర్థిగా పురందరేశ్వరి వైజాగ్ నుంచి పోటీ చేశారు. అయితే ఈ సారి మాత్రం తన సోదరుడు బాలకృష్ణ అల్లుడు భరత్పై ఆమె బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. విశాఖలో ఓ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు కీలకం కానున్నారు. వీరితో పాటు మత్స్యకారులు, అక్కడ స్థానిక కంపెనీల్లో పనిచేసే కార్మికులు, యువత కూడా ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇక 2014లో బీజేపీ నుంచి హరిబాబు తన సమీప వైసీపీ అభ్యర్థి వైయస్ విజయమ్మపై 90 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
నరసాపురంలో త్రిముఖ పోటీ
నరసాపురంలో పార్లమెంటు స్థానంలో ఈసారి త్రిముఖ పోరు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ వైసీపీ నుంచి రఘురామకృష్ణం రాజు బరిలో నిలుస్తుండగా కాంగ్రెస్ నుంచి కనుమూరి బాపిరాజు, జనసేన నుంచి పవన్ సోదరుడు నాగబాబు , టీడీపీ నుంచి శివరామరాజులు పోటీలో ఉన్నారు. జనసేన టికెట్పై మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ పోటీచేస్తున్న భీమవరం అసెంబ్లీ సెగ్మెంట్ కూడా నరసాపురం పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. ఈ నియోజక వర్గంలో కాపు, క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు కీలకంగా మారనున్నారు. 2014లో బీజేపీకి చెందిన గోకరాజు గంగరాజు వైసీపీ అభ్యర్థి రవీంద్రనాథ్ పై 85వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
రాజమండ్రి:
ఆంధ్రప్రదేశ్లో మరో కీలక నియోజకవర్గం రాజమండ్రి. ఇందులో టీడీపీ నుంచి ఎంపీ మురళీ మోహన్ కోడలు మాగంటి రూపా బరిలో నిలుస్తుండగా మార్గాని భరత్ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గం కాపు ఉద్యమాలకు పెట్టింది పేరు. ఇక్కడ అన్ని పార్టీలకు ప్రధానంగా ఉన్న అంశం పోలవరం ప్రాజెక్టు. ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గంకు చెందిన ఓటర్లు అధిక సంఖ్యలో ఉండగా దళిత సామాజిక వర్గానికి చెందిన వారు కూడా అదే స్థాయిలో ఉన్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కూడా అభ్యర్థి గెలుపులో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇక 2014లో టీడీపీకి చెందిన మాగంటి మురళీమోహన్ వైసీపీ అభ్యర్థి బీవీ చౌదరిపై 1.7 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
విజయవాడ:
ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికవాడగా గుర్తింపు పొందిన విజయవాడ సీటుపై దేశం దృష్టి ఉంది. ఇక్కడ బరిలో టీడీపీ నుంచి కేశినేని నాని ఉండగా... వైసీపీ నుంచి పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ బరిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు విజయవాడ చుట్టూ తిరుగుతుండటం విశేషం. విజయవాడ నియోజకవర్గంలో ఎక్కవగా కమ్మ, కాపు సామాజిక వర్గానికి చెందినవారు ఉన్నారు. ముస్లిం ఓటర్లు కూడా ఓ మోస్తారుగా ఉన్నారు. 2014లో టీడీపీ నుంచి కేశినేని నాని వైసీపీ అభ్యర్థి కోనేరు రాజేంద్ర ప్రసాద్ పై 74వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
కడప గడప ఎవరిది..?
ఆంధ్రప్రదేశ్లో మరో ముఖ్య పార్లమెంట్ నియోజకవర్గం కడప జిల్లా. వైయస్ కుటుంబానికి ఈ సీటు కంచుకోటగా ఉంటోంది. ప్రస్తుతం ప్రధాన పోటీ వైసీపీ టీడీపీల మధ్యే ఉంది. ఈసారి బరిలో వైసీపీ నుంచి వైయస్ అవినాష్ రెడ్డి బరిలో ఉండగా టీడీపీ నుంచి ఆదినారాయణ రెడ్డి బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో అత్యధిక ఓటర్లు దళితులు ఇతర వెనకబడిన వర్గాల వారే ఉండటం విశేషం. 2014లో వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి టీడీపీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డిపై 1.90 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.