ఆ పని కాస్త ఆపుతారా? మాట్లాడుతున్నా కదా..!: ఐఈఏ సదస్సు నిర్వాహకులపై రాష్ట్రపతి అసహనం
అమరావతి: ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్(ఐఈఏ) సదస్సులో నిర్వాహకుల అత్యుత్సాహం కారణంగా తీవ్ర గందరగోళం ఏర్పడడంతో ఆ సమయంలో ప్రసంగిస్తున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
Recommended Video
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా.. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబులతో పాటు పలువురు మంత్రులు పాల్గొన్న ఈ సదస్సులో ప్రారంభోపన్యాసం ముగియకమునుపే, వచ్చిన వారికి ఆహార పొట్లాలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించడం గందరగోళానికి దారితీసింది.
ఆహార పొట్లాల కోసం విద్యార్థులతో పాటు సదస్సుకు వచ్చిన వారు పరుగులు పెట్టడంతో సభ రసాభాసగా మారింది. రాష్ట్రపతి రామ్నాథ్ ప్రసంగిస్తున్న సమయంలోనే ఇది జరగడంతో.. ఆయన చురకలంటించారు.
తన ప్రసంగానికి ఆటంకం కలిగించిన నిర్వాహకుల తీరును ఆయన బహిరంగంగానే తప్పుబట్టారు. 'ఆ పని కాస్త ఆపుతారా? మాట్లడుతున్నా కదా..!' అంటూ వేదికపై నుంచే ఆయన కోరడం గమనార్హం. ఆహారాన్ని అందించడం తప్పు కాదని, అయితే, అది సభకు ఆటంకం కలిగించేలా ఉండ కూడదని రాష్ట్రపతి హితవు పలికారు.