ఏపీ ప్రభుత్వం చట్టం చెల్లదా..? సుప్రీంలో కీలక వాదనలు..వాట్ నెక్ట్స్ ..?
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. మూడు రాజధానులపై స్టే ఇచ్చిన ఏపీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ స్టే ఇవ్వాల్సిందిగా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సుభాష్ రెడ్డి మరియు జస్టిస్ షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేసింది. మూడు రాజధానుల అంశంపై ఏపీ హైకోర్టు విచారణ చేస్తున్నందున సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేదని ధర్మాసనం తెలిపింది. ఆగష్టు 4వ తేదీన ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ ఏవీ శేషసాయి మరియు జస్టిస్ సత్యనారాయణ మూర్తిలతో కూడిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్టేటస్ కో విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత ఆగష్టు 14 ఆ పై ఆగష్టు 27 వరకు స్టేను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
వాదనలు ఇలా జరిగాయి
ఇదిలా ఉంటే మూడు రాజధానుల అంశంపై హై కోర్టులో రోజువారీ విచారణ చేపట్టేలా షెడ్యూల్ ఫిక్స్ అయిన నేపథ్యంలో తాము జోక్యం చేసుకోవడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అంతేకాదు విచారణ వేగవంతం చేసి త్వరగా తీర్పును వెల్లడించాలని హైకోర్టుకు సూచించింది అత్యున్నత న్యాయస్థానం. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ రాకేష్ ద్వివేది.. స్టే ఎత్తివేస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో మొత్తం కార్యనిర్వహణ నిలిచిపోయిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. హైకోర్టు ఇచ్చిన స్టేతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయని న్యాయస్థానంకు తెలిపారు అడ్వకేట్ ద్వివేది.
ఫాలీ నారీమన్ వాదన ఏంటి..?
ఇదిలా ఉంటే రైతుల తరుపున మరో సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ వాదించారు. రోజు వారీ విచారణకు సమయం కేటాయించినందున స్టే ఎత్తివేస్తూ ఆదేశాలు ఇవ్వరాదని ధర్మాసనంను కోరారు. ఇదిలా ఉంటే రైతుల తరుపునే వాదిస్తున్న మరో సీనియర్ న్యాయవాది ఫాలీ ఎస్ నారీమన్ మరో అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. హైకోర్టు ఏర్పాటు అమరావతిలో ఏర్పాటు చేయాలనేది రాష్ట్రపతి ఉత్తర్వులతో జరిగిందని రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని అన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులను అసెంబ్లీలో చట్టం చేయరాదని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.
గెజిట్ నోటిఫికేషన్లపై ఏపీ హైకోర్టు...
ఆగష్టు 4వ తేదీన మూడు రాజధానుల అంశంపై రైతులు వేసిన రిట్ పిటిషన్ను విచారణ చేసిన హైకోర్టు స్టే ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో రాష్ట్రప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు 10 రోజుల సమయం ఇచ్చింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టాలను సవాల్ చేస్తూ హైకోర్టులో రైతులు పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉంటే గెజిట్ నోటిఫికేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడం సరికాదని పేర్కొంటూ అడ్వకేట్ మహఫూజ్ నజ్కీ కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత కూడా సరైన కారణాలు చూపకుండా హైకోర్టు స్టే ఇస్తూ ఆదేశాలు ఇవ్వడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.
ఇప్పటికే సుప్రీంలో రెండు సార్లు వాయిదా
అంతకుముందు రెండు సార్లు అత్యున్నత న్యాయస్థానం ముందుకు పిటిషన్లు విచారణకు రాగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే , జస్టిస్ నారీమన్లు ఇద్దరూ కేసును విచారణ చేయలేమంటూ బెంచ్ నుంచి తప్పుకున్నారు. ఈ కేసులో రైతుల తరపున జస్టిస్ బోబ్డే కుమార్తె వాదిస్తుండగా నారీమన్ తండ్రి ఫాలీ నారీమన్ కూడా రైతుల తరపున వాదిస్తుండటంతో ఆయన కూడా విచారణ చేసేందుకు నిరాకరించారు. ఇలా ఆగష్టు 14న ఒకసారి అలానే ఆగష్టు 19న ఒకసారి వాయిదా పడగా బుధవారం రోజున అంటే ఆగష్టు 26వ తేదన జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ప్రస్తుత బెంచ్ విచారణ చేసింది. త్వరతగతిన విచారణ పూర్తి చేసి నిర్ణయం వెల్లడించాలని అత్యున్నత న్యాయస్థానం ఏపీ హైకోర్టుకు సూచనలు చేసింది.