అమరావతి శంకుస్థాపన: 15ని. పాటు పూజలో ప్రధాని మోడీ, ఏం చేస్తారంటే?
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన పూజా కార్యక్రమాలను స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా నిర్వహించనున్నారు. అంతేకాదు సుమారు 15 నిమిషాల పాటు ఆయన పూజా క్రతువులో పాల్గొననున్నట్లు తెలిసింది. అమరావతి శంకుస్థాపనకు సంబంధించి ప్రధాని మోడీ పర్యటన రూట్ మ్యాప్ను ఈరోజు ఖరారు చేయనున్నారు.
ప్రధాని మోడీ హెలిప్యాడ్ దిగింది మొదలు ప్రధాన వేదిక వద్దకు చేరుకునే వరకు ఆయన ఏమేమి చేయాల్సి ఉంటుందో, భద్రతా ఏర్పాట్లకు సంబంధించి ఏమేమి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందో గుంటూరు జిల్లా యంత్రాంగం, పోలీసు ఉన్నతాధికారులు సమీక్షించారు.
ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి వన్ఇండియాకు అందిన సమాచారం మేరకు అక్టోబర్ 22న ప్రధాని మోడీ ఢిల్లీ నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో అమరావతి ప్రాంతానికి చేరుకుంటారు.
అమరావతి ద్వారం నుంచి శంకుస్థాపన జరిగే ప్రాంతానికి కారులో చేరుకుంటారు. ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన ఆర్ట్ పెయింటింగ్ ప్రదర్శనను వీక్షిస్తారు. ఆయన వచ్చే నడక మార్గంలోనే అమరావతి బౌద్ధ చరిత్రను తెలిపే కళాఖండాలు ప్రదర్శిస్తారు. భవిష్యత్తు అమరావతి రాజధాని ఎలా ఉండబోతుందో కూడా చక్కటి పెయింటింగ్లతో ఆర్ట్ గ్యాలరీలో ఉంచబోతున్నారు.
రాజధాని శంకుస్థాపన ప్రాంతంలో ప్రధాని మోడీకి పురోహితులు పూర్ణకుంభంతో స్వాగతం పలుకనున్నారు. ఆ తర్వాత మోడీ అక్కడే ఏర్పాటు చేసి హోమగుండంలో ద్రవ్యాలు వేస్తారు. అమరావతి సిద్ధాంతితో కలిపి ముగ్గురు పురోహితులకు మాత్రమే ఇక్కడ అవకాశాన్ని కల్పించారు.
హోమ ద్రవ్యాలు వేసిన తర్వాత ఇక వెనుతిరిగి చూడకూడదని పండితులు సూచించారు. ఈ మేరకు ప్రధాని ముందుకు సాగుతూ వెళతారు. ఆ తర్వాత రత్నన్యాసం కార్యక్రమంలో మోడీ పాల్గొంటారు. రత్నాలను స్వహస్తాలతో మోడీ హోమగుండంలో వేస్తారు. రత్నన్యాసం పూర్తవగానే శిలన్యాసం కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొంటారు.
ఇది జరుగుతుండగానే పురోహితులు మోడీకి ఆశీర్వచనం ఇస్తారు. ఈ మహాక్రతువుతో అమరావతి పూజ ముగుస్తుంది. ఆనంతరం మోడీ వెనుకకు చూడకుండా శంకుస్థాపన ప్రాంతం నుంచి బయటకు వస్తారు. అనంతరం లక్షల మంది వీక్షిస్తుండగా రాజధాని శంకుస్థాపనకు సంబంధించిన పైలాన్ను ఆవిష్కరిస్తారు.
ఈ కార్యక్రమానికి 17 వేల మంది పోలీసులను బందోబస్తు విధులు కేటాయించాలని నిర్ణయించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యే కార్యక్రమం కావటంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. దీనితో పాటు ఢిల్లీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా ప్రధాని భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
రాజధాని అమరావతి శంకుస్థాపన కోసం 80 అడగుల వెడల్పు, 40 అడుగుల పొడవుతో భారీ సభా వేదికను నిర్మిస్తున్నారు. వేదికపై ప్రధాని కాకుండా మరో 14 మంది మాత్రమే ఉండాలని ఇప్పటికే ప్రధాని కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి. ఈ క్రమంలో సభా వేదికను రెయిన్ప్రూఫ్ టెంట్లతో ప్రత్యేక అలంకరణతో నిర్మిస్తున్నారు.
వీఐపీలకు విందు ఏర్పాటు చేయనున్నారు. సభకు హాజరయ్యే లక్ష మందికి ఆహారం ప్యాకెట్లు అందజేయాలని నిర్ణయించి, ఆ బాధ్యతను జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులకు అప్పగించారు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన శంకుస్థాపన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
శంకుస్థాపన కార్యక్రమానికి ముందు భారీ ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ప్రముఖ వాద్య కళాకారుడు ‘డ్రమ్స్' శివమణి తన డ్రమ్స్ తో సభా ప్రాంగణాన్ని హోరెత్తించనున్నాడు. ఇక ఆంధ్రప్రదేశ్కు చెందిన కూచిభొట్ల ఆనంద్ నేతృత్వంలో కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకోనున్నాయి.
మరోవైపు అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి మూడు వేదికలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో ప్రధాన వేదికపై ప్రధాని నరేంద్రమోడీ, సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు 15 మంది కీలక వ్యక్తులు ఆసీనులు కానున్నారు. ఈ వేదికకు దిగువున మరో రెండు వేదికలు ఏర్పాటు చేస్తున్నారు.
వీటిపై వివిధ దేశాల నుంచి వచ్చే ప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులు ఆసీనులవుతారు. ఇక రాజధాని నిర్మాణం కోసం భూములనిచ్చిన రైతుల కోసం ప్రత్యేకంగా గ్యాలరీని ఏర్పాటు చేశారు. రైతులకు అందించనున్న ఆహ్వాన పత్రికలే వారికి ఎంట్రీ పాసులుగా పనిచేస్తాయని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.
ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బాబా సాహెబ్ భోసలేకు ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అమరావతి శంకుస్థాపన ఆహ్వాన పత్రిక అందచేశారు. మంత్రి నారాయణతో కలిసి మంగళవారం రాత్రి ప్రధాన న్యాయమూర్తి నివాసానికి వెళ్లిన ఆయనను ఆహ్వానించారు.