అమరావతి: యాంకర్గా హీరో సాయికుమార్, మూడు వేదికలు ఏర్పాటు
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి టాలీవుడ్ హీరో, ప్రముఖ నటుడు సాయి కుమార్ యాంకర్గా వ్వవహరించనున్నాడు. ఈ మేరకు మంగళవారం మంత్రులు, ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు.
అక్టోబర్ 22న జరిగే ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం అందుకు తగిన ఏర్పాట్లను ముమ్మరం చేసింది. చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి.
శంకుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోడీతో సహా వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవనున్న నేపథ్యంలో సాయి కుమార్ యాంకరింగ్ అయితే బాగుంటుందనే ఉద్దేశ్యంతో సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అమరావతి మట్టి-నీరు కార్యక్రమం జరుగుతోంది.
శంకుస్థాపన కార్యక్రమానికి ముందు భారీ ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ప్రముఖ వాద్య కళాకారుడు ‘డ్రమ్స్' శివమణి తన డ్రమ్స్ తో సభా ప్రాంగణాన్ని హోరెత్తించనున్నాడు. ఇక ఆంధ్రప్రదేశ్కు చెందిన కూచిభొట్ల ఆనంద్ నేతృత్వంలో కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకోనున్నాయి.
మరోవైపు అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి మూడు వేదికలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో ప్రధాన వేదికపై ప్రధాని నరేంద్రమోడీ, సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు 15 మంది కీలక వ్యక్తులు ఆసీనులు కానున్నారు. ఈ వేదికకు దిగువున మరో రెండు వేదికలు ఏర్పాటు చేస్తున్నారు.
వీటిపై వివిధ దేశాల నుంచి వచ్చే ప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులు ఆసీనులవుతారు. ఇక రాజధాని నిర్మాణం కోసం భూములనిచ్చిన రైతుల కోసం ప్రత్యేకంగా గ్యాలరీని ఏర్పాటు చేశారు. రైతులకు అందించనున్న ఆహ్వాన పత్రికలే వారికి ఎంట్రీ పాసులుగా పనిచేస్తాయని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.
రాజధాని అమరావతి శంకుస్ధాపన కోసం రాష్ట్రం నలుమూలల నుంచి సేకరించిన సేకరించిన మట్టి, నీరు కలశాలను అందరికీ కనిపించేలా ప్రదర్శిస్తారు.