మళ్లీ రెచ్చిపోయిన బాలయ్య..! కార్యకర్త గూబ గుయ్యిమనిపించిన శాతకర్ణి..!!
అనంతపురం/హైదరాబాద్ : అరె మామా ఎక్ పెగ్ లా...అరె మామా ఎక్ పెగ్ లా అని అలరించిన హీరో బాలక్రిష్ణ ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎన్నికల ప్రచారంలో తన పార్టీ తరుపున, తన గెలుపుగురించి ప్రజలకు చెప్పుకుంటే పరవాలేదు గాని పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, మీడియా ప్రతినిధులపై అనుచిత ప్రవర్తనే చిక్కులు తెచ్చి పెడుతోంది. నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి పూనకం వచ్చినట్టు ఊగిపోయారు. తనను ప్రశ్నించిన సొంత కార్యకర్తపైనే రెచ్చిపోయారు. ఆవేశంలో ఆ కార్యకర్త పట్ల దురుసుగా ప్రవర్తించి హంగామా సృష్టించారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో ఓ కార్యకర్త మాట్లాడుతూ... నీటి సమస్య బాగా ఉందని, సిరివరం చెరువుకు నీరు విడుదల చేయాలని బాలకృష్ణ ని వేడుకున్నాడు.
అంతే ఆగ్రహానికి గురైన బాలయ్య ఆ టీడీపీ కార్యకర్త రవికుమార్ను కొట్టారు. అతన్ని బయటకు పంపాలని పోలీసులకు ఆదేశాలు సైతం జారీ చేశారు. దీంతో కార్యకర్త రవికుమార్ను పోలీసులు బయటకి నెట్టేశారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన రవికుమార్ టీడీపీకి రాజీనామా చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా సరిగ్గా రెండు రోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో ఓ వీడియో జర్నలిస్టును నరికి పోగులు పెడతానంటూ బాలకృష్ణ హెచ్చరించాడు. కాగా ఇప్పటికే పలుమార్లు ఆయన అభిమానులు, ఇతర సహాయకుల మీద దాడికి పాల్పడి విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇక బాలయ్య బాబు సినిమా అనుకొని నిజ జీవితంలో కూడా అలానే ప్రవర్తిస్తున్నారని అభిమానులు చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది.