శివాజీ దీక్ష: ఒత్తిడిలో పవన్ కళ్యాణ్, చిక్కుల్లో వెంకయ్య, బాబు సేఫ్?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ తెలుగు సినీ నటుడు శివాజీ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది. అయితే, తెలుగుదేశం పార్టీ కన్నా బిజెపికి అది ఎక్కువ ఇబ్బందికరంగా మారినట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు బిజెపిలో చేరిన శివాజీ ఆ పార్టీనే ప్రశ్నిస్తూ, ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని పల్లెత్తు మాట అనకుండా దీక్ష సాగిస్తున్నారు. పవన్ కళ్యాణ్ లాంటివారు తనకు మద్దతు ఇవ్వాలని ఆయన పదే పదే కోరుతున్నారు.
శివాజీ దీక్షతో పవన్ కళ్యాణ్పై ఒత్తిడి పెరిగినట్లు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలు శివాజీకి మద్దతు ఇచ్చారు. అయితే, పవన్ కళ్యాణ్ శివాజీ దీక్షపై కాకున్నా ప్రత్యేక హోదాపై ఏదో ఒకటి మాట్లాడాల్సిన అనివార్యతలో పడ్డారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బిజెపికి, టిడిపికి మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం సాగించారు. ఆ రెండు పార్టీలు గెలిచి, ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తే హామీలను అమలు చేయించడానికి తాను పనిచేస్తానని కూడా హామీ ఇచ్చారు.
ప్రత్యేక హోదాపై కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు తదితర పార్టీలు గొంతెత్తుతూ శివాజీ నిరాహార దీక్ష చేపట్టడంతో పవన్ కళ్యాణ్పై ఒత్తిడి పెరుగుతున్నట్లు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదాపై ఏ విధమైన వైఖరి ప్రదర్శిస్తారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.
కాగా, కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు ప్రత్యేక హోదా విషయంలో చిక్కుల్లో పడినట్లు కనిపిస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో పట్టుబట్టి పదేళ్ల పాటు ప్రత్యేక హోదాకు హామీని రాబట్టారు. దాన్ని అమలు చేయించాల్సిన బాధ్యత కూడా వెంకయ్యపైనే ఉందని అందరూ భావిస్తున్నారు. ఈ స్థితిలో శివాజీ దీక్ష వెంకయ్య నాయుడిపై ఒత్తిడి పెరిగినట్లు కనిపిస్తోంది.
కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మాత్రం శివాజీ ఏమీ అనడం లేదు. కేంద్ర మంత్రివర్గంలో తెలుగుదేశం పార్టీ కొనసాగుతోంది. చంద్రబాబు మంత్రివర్గంలో బిజెపి చేరింది. కేంద్రంతోనే కాకుండా ప్రధాని నరేంద్ర మోడీతో సత్సంబంధాలను చంద్రబాబు కోరుకుంటున్నారు. ఆ సంబంధాలను చెడగొట్టుకోవడం ఆయనకు ఇష్టం లేదు. దీంతో కేంద్రాన్ని ప్రశ్నించే స్థితిలో ఆయన లేరనే భావన వ్యక్తమవుతోంది. అయినా, శివాజీ చంద్రబాబును ఏమీ అనడం లేదు. దీంతో చంద్రబాబు కాస్తా సేఫ్గానే ఉన్నట్లు కనిపిస్తున్నారు.
ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెసు పార్టీ గట్టిగా మాట్లాడుతున్నప్పటికీ ప్రధాన ప్రతిపక్షం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పట్టుపట్టడం లేదు. ఈ విషయంలో వైయ్ససార్ కాంగ్రెసు పార్టీకి లేదా ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న రాజకీయ వైఖరి ఏమిటో తెలియదు. ఏమైనా, శివాజీ దీక్షపైనే ఇప్పుడు అందరి దృష్టీ కేంద్రీకృతమైంది.