చదువులేని వ్యక్తి, ఐఏఎస్లను ఎలా కంట్రోల్ చేస్తారు: పవన్ కళ్యాణ్పై శివాజీ తీవ్రవ్యాఖ్యలు
Recommended Video
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన నటుడు శివాజీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ధర్మపోరాట దీక్ష సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియోలో వైరల్గా మారుతోంది. పవన్తో పాటు వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. పలు సందర్భాల్లో జనసేనానిని, వైసీపీ అధినేతను ఇమిటేట్ చేస్తూ సెటైర్ వేశారు.
వీళ్ల చదువుకు ప్రభుత్వాన్ని కంట్రోల్ చేస్తారా?
ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్న వారిలో ఒకాయన బీఏ (జగన్), మరొకతను (పవన్ కళ్యాణ్) 9వ తరగతి చదువుకున్నారని నటుడు శివాజీ ఎద్దేవా చేశారు. ఈ చదువులు చదువుకున్న వారు ఐఏఎస్లను, ఐపీఎస్లను ఎలా కంట్రోల్ చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. లక్షలు లక్షలు పెట్టి మనం పిల్లల్ని ఎందుకు చదివిస్తున్నామని, ఏం చదవకపోయినా ముఖ్యమంత్రి కావొచ్చు, ఏం చదవకపోయినా మంత్రి కావొచ్చు అయితే ఎలా అన్నారు. ఏం చదువుకోకపోయినా ఏమైనా చేయవచ్చు అంటే ఇక చదువులు ఎందుకని నిలదీశారు. పిల్లల భవిష్యత్తు కోసం ఒక్కో స్కూల్లో ఫీజులు కట్టి చదివిస్తున్నామని, రేపు ఈ పిల్లలు దేశం కోసం, రాష్ట్రం కోసం, రాబోయే తరాల కోసం పని చేస్తారన్నారు.
చదువుసంధ్యా లేని వ్యక్తి వచ్చి సీఎం అయితే ఏపీ బాగుపడుతుందా?
కానీ ఇంతపెద్ద ముఖ్యమంత్రి పదవికి చదువు, సంధ్యాలేని వ్యక్తులు వచ్చి కూర్చుంటే రాష్ట్రం బాగుంటుందా ఆలోచించాలని పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి శివాజీ అన్నారు. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ అంటే తనకు ఇష్టమని చెప్పారు. ఆయన అంటే ఇష్టపడేవారిని జనసేనాని ఎప్పుడూ పట్టించుకోరని చెప్పారు. అది వేరే విషయమన్నారు. ఆయన ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఏం సపోర్ట్ చేస్తున్నారో చెప్పాలన్నారు. నిన్నటికి నిన్న ప్రధాని మోడీ గుంటూరుకు వస్తే ఏం ప్రశ్నించారని నిలదీశారు. పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని, రూ.75వేలు కోట్లు బాకీ అబ్బా నువ్వు.. అని గతంలో చెప్పిన పవన్ ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదన్నారు. ఈ సందర్భంగా జనసేనానిని ఇమిటేట్ చేస్తూ మాట్లాడారు.
పవన్, జగన్ ఎక్కడ నిద్రపోతున్నారు?
నరేంద్ర మోడీ గుంటూరుకు వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని, అప్పుడు జగన్, పవన్ కళ్యాణ్లు ఎక్కడ నిద్రపోతున్నారని శివాజీ ప్రశ్నించారు. అలాగే మేం టీడీపీకి ఎంత దూరమో, బీజేపీకి అంతే దూరమని చెప్పిన జగన్.. నిరసన ఎందుకు తెలియజేయలేదన్నారు. ఏపీకి అన్యాయం జరుగుతుంటే నిరసన తెలియజేయడం మీ బాధ్యత కాదా అన్నారు. మాకు బీజేపీకి ఏం సంబంధం లేదబ్బా.. అంటారని, కానీ నిరసన తెలియజేయాలి కదా అని జగన్ను ఇమిటేట్ చేశారు.
ఇదీ లోకేష్ కెపాసిటీ!
చంద్రబాబు గురించి, లోకేష్ గురించి మోడీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని శివాజీ అన్నారు. చంద్రబాబు సక్సెస్ఫుల్ ఫాదర్ అని చెప్పారు. లోకేష్ సక్సెస్ఫుల్ సన్ అన్నారు. నేను పొగడటానికి మాట్లాడటం లేదన్నారు. రికమెండేషన్ లెటర్ లేదా ఎవరో చెబితే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో సీటు రాదని, కానీ లోకేష్ కష్టపడి అక్కడ సీటు సంపాదించారన్నారు. లోకేష్ మంత్రిగా నిరూపించుకున్నారని చెప్పారు. ఆయన తన పని తాను చేసుకుంటున్నారని చెప్పారు. లోకేష్ను ఎప్పుడూ ముందు చూడలేదని, వెనుకాలే ఉంటారని, నేర్చుకుంటూ ఉంటారని చెప్పారు.