ది బెస్ట్ గల్లా జయదేవ్ కు ఇలా జరగడం...చాలా బాధగా ఉంది:హీరో సుమంత్
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం పోరాటంలో భాగంగా టిడిపి ఎంపీలు ఢిల్లీలో ప్రధాని నివాసం ముందు ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో తెలుగుదేశం ఎంపీలను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా వారిని తరలించే క్రమంలో టీడీపీ ఎంపీలను పోలీసులు లాగి పడేశారు. అలా పోలీసులు బలవంతంగా తరలించిన వారిలో ఎంపీ గల్లా జయదేవ్ కూడా ఉన్నారు.
దీనిపై ప్రముఖ సిని హీరో సుమంత్ స్పందించారు. ఢిల్లీలో తమ ఆందోళనకు సంబంధించి గల్లా జయదేవ్ పెట్టిన ఫోటో పోస్ట్ కు స్పందనగా తన కామెంట్ పెట్టారు. "నాకు తెలిసిన వ్యక్తుల్లో ది బెస్ట్ అయిన గల్లా జయదేవ్కు ఇలా జరగడం చూస్తుంటే చాలా బాధగా ఉంది"...అని సుమంత్ తన ఆవేదన వెలిబుచ్చారు. టిడిపి ఎంపీలను పోలీసులు లాగి పడేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
అంతకుముందు ప్రధాని మోడీ నివాసం ముట్టడికి టీడీపీ ఎంపీలు యత్నించగా, వారి నిరసనల గురించి ముందుగానే సమాచారం అందుకున్న పోలీసులు భారీగా మోహరించడంతో పాటు ఆ ప్రాంతంలో బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఎంపీలు అశోక్ గజపతిరాజు, సీఎం రమేష్, గల్లా జయదేవ్, మురళీ మోహన్, రామ్మోహన్ నాయుడు తదితరులంతా ప్రధాని ఇంటి వద్దకు చేరుకోగానే వారిని పోలీసులు అడ్డుకున్నారు.
అది నిషేధిత ప్రాంతమని చెప్పినా ఎంపీలు వినకపోవడంతో వారిని బలవంతంగా అదుపులోకి తీసుకుని బస్సులో ఎక్కించి అక్కడి నుంచి తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషనుకు తరలించారు. అరెస్టులతో తమను ఆపలేరని, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ఈ సందర్భంగా ఎంపీ సీఎం రమేష్ హెచ్చరించారు.