తిరుమల అంటే ఎంతో ఇష్టం...శ్రీవారి సన్నిధిలో సినీ నటి సమంత;రెండుగా చీలిన టిటిడి ఉద్యోగ సంఘం
తిరుమల:తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారిని ప్రముఖ కథానాయిక సమంత దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ ప్రారంభదర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు.
మరోవైపు టీటీడీ ఉద్యోగ సంఘంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. టీటీడీ ఉద్యోగ సంఘం రెండుగా చీలిపోయింది. తమ సమస్యలు పరిష్కరించపోతే ఆగస్టు 16 నుంచి సమ్మె చేస్తామని టిటిడి రెగ్యులర్ ఉద్యోగులు గతంలో సమ్మె నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే . ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి ఉద్యోగులు ఇచ్చిన గడువు సమీపిస్తున్న నేపథ్యంలో టిటిడి ఉద్యోగ సంఘంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి.
శ్రీవారి సన్నిధిలో...సమంత
శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపానికి చేరుకున్నఆమెకు అర్చకులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శన కార్యక్రమాల అనంతరం సమంత మాట్లాడుతూ తనకు తిరుమల అంటే ఎంతో ఇష్టమని అన్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి గతంలోనూ చాలాసార్లు వచ్చానని... ఆయన్నిదర్శించుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుందని చెప్పారు.
మహాసంప్రోక్షణ...సమయంలోనా?
మరోవైపు టీటీడీ ఉద్యోగ సంఘంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఓ వర్గం ఉద్యోగులు సమ్మె నోటీసును వ్యతిరేకిస్తుండటమే టీటీడీ ఉద్యోగ సంఘం రెండుగా చీలికకు దారితీసింది. ఇది రాజకీయ ప్రేరేపిత సమ్మె కాబట్టి కొందరు ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఏళ్లతరబడి పరిష్కారం కాని సమస్యలపై...మహాసంప్రోక్షణ సమయంలో సమ్మె నోటీసులు ఇవ్వడంపై ఉద్యోగుల్లో కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం.
మేము...భక్తుల సేవలోనే
తమ నేతలు సమ్మెలో పాల్గొన్నా తాము మాత్రం భక్తుల సేవలోనే ఉంటామని ఆయా ఉద్యోగులు స్పష్టం చేశారట. దీంతో కొందరు ఉద్యోగులు ఇలా ఎదురుతిరగడంపై టిటిడి ఉద్యోగ సంఘం మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలిసింది. మరోవైపు సమ్మెపై టిటిడి కాంట్రాక్టు కార్మికులు గతంలోనే తీర్మానం చేయగా వారిలోనూ కొందరు ఉద్యోగాలు పోతాయని భయపడుతున్నట్లు తెలిసింది.
ఇవీ...డిమాండ్లు
సుప్రీం కోర్టు మార్గదర్శకాల మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. అయితే ఈ సమస్యలు ఇప్పటివరకు పరిష్కారం కాకపోవడంతో టిటిడి ఉద్యోగ సంఘం సమ్మె విషయమై ఉత్కంఠ నెలకొంది.