చంద్రబాబు ఇంటి వద్ద హై టెన్షన్ : లోకేశ్ ను అడ్డుకున్న పోలీసులు : భైఠాయింపు..!!
Recommended Video
ఛలో ఆత్మకూరు టెన్షన్ గుంటూరు జిల్లాలో ఉద్రిక్తతంగా మారింది. ఉండవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద హై టెన్షన్ కనిపిస్తోంది. మాజీ మంత్రి లోకేశ్ ను పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఆయన ఇంటి వద్దకు వస్తున్న పార్టీ నేతలను అరెస్ట్ చేస్తున్నారు. చంద్రబాబు ఇంటి వద్దకు పోలీసులు ఎలా వస్తారని లోకేశ్ ప్రశ్నించారు. అక్కడ ఉన్న టీడీపీ నేతలతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. ఎవరినీ ప్రతిపక్ష నేత ఇంటి వద్దకు రానీయటం లేదు. ఎమ్మెల్యే రామానాయుడు పార్టీ అధినేత ఇంటి వద్దకు చేరుకున్నారు. విజయవాడ.. కర్నూలు నుండి వచ్చిన నేతలు చంద్రబాబు ఇంటి వద్ద పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మరి కాసేపట్లో చంద్రబాబు ఛలో ఆత్మకూరు కు బయల్దేరనున్నారు. ఆ సమయంలో పోలీసులు ఏ రకంగా వ్యవహరిస్తారు.. చంద్రబాబును ముందుకు వెళ్లనిస్తారా..కార్యకర్తలు ఎలా రియాక్ట్ అవుతారనేది ఉత్కంఠ భరితంగా మారింది.
భయోత్పాతం సృష్టిస్తున్నారు, మూడేళ్లే: చంద్రబాబు సంచలనం, టీడీపీ శిబిరం వద్ద భారీగా పోలీసులు
చంద్రబాబు నివాసం వద్ద భారీగా బలగాలు..
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద భారీగా పోలీస బలగాలు మొహరించాయి. ఆయన తన ఇంటి నుండి ఛలో ఆత్మకూరుకు బయల్దేరుతానని ప్రకటించారు. ఇప్పటికే పలు ప్రాంతాల నుండి చంద్రబాబు నివాసం వద్దకు వస్తున్న నేతలను పోలీసులు అరెస్ట్ చేసారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని..ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్.. వర్ల రామయ్య..తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాశ్ ను పోలీసులు చంద్రబాబు నివాసం వద్దకు రాకుండా అరెస్ట్ చేసారు. మాజీ మంత్రి దేవినేని ఉమా..బుద్దా వెంకన్న..అశోక్ బాబులను పోలీసులు వారి ఇళ్లల్లోనే నిర్బంధించారు. విజయవాడ నుండి గుంటూరు జిల్లాలోకి ప్రవేశించి మార్గాలను పోలీసులు పూర్తిగా అదుపులోకి తీసుకున్నారదు. ఇక, గుంటూరు లోని వైసీపీ బాధితుల పేరుతో టీడీపీ ఏర్పాటు చేసిన శిబిరం వద్దకు ఏ ఒక్కరినీ అనుమతించటం లేదు. అక్కడ ఉన్న వారిని పోలీసులే ఆత్మకూరుకు తరలించే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. జిల్లాలోని టీడీపీ నేతలను ముందుగానే పోలీసులు నియంత్రించారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయం పూర్తిగా పోలీసులు పహారా మధ్య ఉంది. అదే విధంగా ప్రకాశం జిల్లాలోని టీడీపీ నేతలను ఇప్పటికే పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. నర్సరావుపేటతో పాటుగా పల్నాడులోని టీడీపీ నేతలను పోలీసులు వారి ఇళ్లల్లో నుండి బయటకు రానీయటం లేదు. దీంతో..గుంటూరు జిల్లా వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతోంది.
లోకేశ్ ను అడ్డుకున్న పోలీసులు..వాగ్వాదం
ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసం వద్ద కొంత మంది పార్టీ నేతలు..తెలుగు విద్యార్ధి సంఘాల నేతలు చేరుకున్నారు. వారిని చంద్రబాబు ఇంటి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అదే విధంగా మీడియాను అనుమతించాలంటూ లోకేశ్ పోలీసులను కోరినా వారు పట్టించుకోలేదు. ఇంటి వద్దకు అల్పాహారం కూడా రాకుండా అడ్డుకోవటం పైన టీడీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇంటి వద్దకు వచ్చిన పార్టీ నేతలతో లోకేశ్ మంతనాలు సాగించారు. ఎక్కడైతే పోలీసులు అడ్డుకుంటారో అక్కడే భైఠాయించి నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు.
చంద్రబాబు ఇంటి నుండి బయటకు రానీయకుండా
అయితే, ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి నుండి బయటకు రానీయకుండా హౌస్ అరెస్ట్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. కరకట్ట మొత్తం పోలీసుల అదుపులో ఉంది. ఏ ఒక్కరినీ అక్కడకు రానీయటం లేదు. ఇక, పల్నాడులో అదనపు బలగాలను మొహరించారు. మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు.. నక్కా అనంద్ బాబు ఇళ్ల నుండి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయం.. బాధితులు ఉంటున్న పునరావాస శిబిరం వద్ద దాదాపు కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. మొత్తంగా అమరావతిలో ఛలో ఆత్మకూరు టెన్షన్ కొనసాగుతోంది.