చంద్రబాబు ఇంటిపై డ్రోన్ కెమెరాలు.. టెన్షన్.. టెన్షన్: జగన్ నివాసం నుండి ఆదేశాలతోనే..!?(వీడియో)
Recommended Video
అమరావతితో చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు ఇంటి మీద డ్రోన్ కెమేరా ఉయోగించటంపైన అక్కడి సెక్యూరిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంటనే తెలుగు యువత నేతలు రంగం లోకి దిగారు. చంద్రబాబు హై సెక్యూరిటీ జోన్ అని..అనుమతి లేకుండా డ్రోన్ ఎందుకు వినియోగిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. డ్రోన్ కెమేరా వినియోగిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ నివాసంలో ఉందే కిరణ్ అనే వ్యక్తి ఆదేశాల మేరకే తాము డ్రోన్ వినియోగించామని వారు చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే, ఇంతలోనే ఇరిగేషన్ శాఖ వివరణ ఇచ్చింది. తామే డ్రోన్ వినియోగించి..నీటి లెక్కలు చెప్పాలని కోరామని..వరద పరిస్థితి అంచనా కోసమే వినియోగించామని స్పష్టం చేసింది. పోలీసుల రంగ ప్రవేశంతో పరిస్థితి సద్దుమణిగింది.
చంద్రబాబు ఇంటి వద్ద డ్రోన్ కలకలం..
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. అనుమతి లేకుండా డ్రోన్ కెమెరా ఉపయోగించడంపై టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేసారు. టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. అసలు ఎవరి అనుమతితో డ్రోన్ వినియోగించారు..ఎందుకు డ్రోన్ వినియోగిస్తున్నారంటూ టీడీపీ నేతలు ప్రశ్నించారు. దీంతో..అక్కడ టీడీపీ నేతలు భైఠాయించి ఆందోళన కొనసాగించారు. ప్రభుత్వ అనుమతితో డ్రోన్ వినియోగించారా..లేక ప్రయివేటు వ్యక్తులు ఎవరైనా రహస్యంగా చిత్రీకరిస్తున్నారా అని టీడీపీ నేతలు నిలదీసారు. ప్రభుత్వం ప్రతిపక్ష నేత చంద్రబాబు భద్రత పట్టించుకోవటం లేదంటూ ఆందోళన వ్యక్తం చేసారు. తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాశ్..టిడి జనార్ఢన్ తో సహా పార్టీ నేతలు చంద్రబాబు నివాసం వద్ద ఆందోళనకు దిగారు. ఇంతలో అక్కడ పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకోవటంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదే సమయంలో ఎమ్మెల్యే ఆర్కే ఎందుకు చంద్రబాబు ఇంటి చుట్టూ తిరుగుతున్నారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కొందరు వైసీపీ నేతలే అక్రమంగా డ్రోన్ల వినియోగిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
అదుపులో ఇద్దరు..సీఎం ఇంటి నుండి ఆదేశాలు..
డ్రోన్లు వినియోగిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారెవరో వారి వివరాలను బయట పెట్టాలని టీడీపీ నేతలు డిమాండ్ చేసారు. వారిద్దరూ ముఖ్యమంత్రి జగన్ నివాసంలోని కిరణ్ అనే వ్యక్తి ఆదేశాల మేరకు వారిద్దరూ డ్రోన్లు వినియోగించినట్లుగా చెబుతున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. వారు చెబుతున్న వివరాల మేరకు అసలు వ్యక్తులు ఎవరో స్పష్టం చేయాలని డిమాండ్ చేసారు. పోలీసులు వచ్చి టీడీపీ నేతలకు నచ్చ చెప్పారు. ఆ ఇద్దరినీ తమకు అప్పగించాలని డిమాండ్ చేసారు. పోలీసులు వారికి సద్ది చెబుతున్న సమయంలో కార్యకర్తలు ప్రభుత్వం..పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. ఇదే సమయంలో సమాచారం టీడీపీ అధినేతకు తెలియటం తో ఆయన వెంటనే డీజీపీతో మాట్లాడారు. గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసారు. తన ఇంటి మీద డ్రోన్ వినియోగించి ఎవరో తెలుసుకోవాలని.. ఎవరు అనుమతి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేసారు. దీంతో..పోలీసులు సైతం చంద్రబాబు నివాసం వద్దకు ఉన్నతాధికారులను పంపారు.
తామే పంపామంటూ..ఇరిగేషన్ శాఖ వివరణ..
చంద్రబాబు ఇంటి వద్ద డ్రోన్ కెమేరాలను తామే పంపామని నీటి పారుదల శాఖ స్పష్టం చేసింది. చంద్రబాబు ఇంటి వద్ద జరుగుతున్న ఆందోళనతో మీడియాకు ఇరిగేషన్ శాఖ నుండి సమాచారం వచ్చింది. వరద తీవ్రత ఎక్కువగా ఉండటంతో తాము కరకట్ట వద్ద పరిస్థితి అంచనా వేయటం కోసమే డ్రోన్ కెమేరాలను వినియోగించామని అధికారులు స్పష్టం చేసారు. ఉదయం నుండి వరద నీరు చంద్రబాబు నివాసం లోకి వచ్చిందనే ప్రచారంతో వాస్తవం తెలుసుకోవటానికి..అదే విధంగా కరకట్ట వద్ద నీటి ప్రవాహం అంచనా వేయటానికి డ్రోన్ కెమేరాలు వినియోగించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. దీంతో..ఇదే విషయాన్ని పోలీసులు ధర్నా చేస్తున్న టీడీపీ నేతలకు వివరించారు. ఇందులో ఎవరి ప్రమేయం లేదని.. ఎటువంటి దురుద్దేశం లేదని.. చంద్రబాబు ఇంటి భద్రతకు ఎటువంటి ముప్పు లేదని పోలీసు అధికారులు తేల్చి చెప్పారు. దీంతో..అక్కడ పరిస్థితి సద్దుమణిగింది.