ఉగ్రవాదులు చొరబడ్డారా? తీర ప్రాంతాల్లో హైఅలర్ట్! రాత్రికి రాత్రి అత్యవసర ఆదేశాలు
న్యూఢిల్లీ/అమరావతి: దేశవ్యాప్తంగా తీర ప్రాంత రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. సముద్ర మార్గం గుండా ఉగ్రవాదులు చొరబడి ఉండొచ్చంటూ ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో.. కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ బుధవారం రాత్రి అత్యవసర ఆదేశాలను జారీ చేసింది. నెల్లూరు జిల్లా విడవలూరు పోలీస్స్టేషన్ పరిధిలోని తీర ప్రాంతాల్లో శ్రీలంకకు చెందినట్టుగా అనుమానిస్తోన్న ఓ బోటు కనిపించడం కలకలం రేపింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని, ఫొటోలతో సహా కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖకు పంపించారు నెల్లూరు జిల్లా పోలీసులు. దీనిపై కూపీ లాగిన తరువాత- అత్యవసర ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.
నెల్లూరుజిల్లా విడవలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పన్నపూడి పాటూరు తీర ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం ఓ గుర్తు తెలియని బోటును పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. మొదటగా దీన్ని గుర్తించిన స్థానిక మత్స్యకారులు ఆరా తీశారు. గతంలో ఎప్పుడూ అలాంటి బోటును చూసి ఉండకపోవడం వల్ల వారికి అనుమానాలు తలెత్తాయి. ఈ విషయాన్ని వారు విడవలూరు పోలీసులకు తెలియజేశారు.
దీన్ని పరిశీలించిన అనంతరం- ఈ బోటు శ్రీలంకకు చెందినదిగా గుర్తించారు. ఈస్టర్ సండే సందర్భంగా శ్రీలంకలో పెద్ద ఎత్తున మారణహోమానికి పాల్పడిన అనంతరం ఉగ్రవాదులు సముద్రమార్గం గుండా భారత్లోకి ప్రవేశించి ఉంటారని అనుమానించారు. ఈ సమాచారాన్ని హుటాహుటిన కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖకు తెలియజేశారు. అన్ని కోణాల్లోనూ దీనిపై ఆరా తీసిన తరువాత ఆ శాఖ అధికారులు కిందటి రాత్రి అత్యవసర ఆదేశాలను జారీ చేశారు.
ఓట్ల లెక్కింపు సందర్భంగా హింసాత్మక పరిస్థితులను ప్రేరేపించేలా ప్రవర్తించవచ్చనే అనుమానాలతో రాష్ట్రానికి అదనపు పోలీసు బలగాలను తరలించారు. రాష్ట్రంలోని అన్ని కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. ఓట్ల లెక్కింపు మాత్రమే కాకుండా.. తదనంతర పరిణామాలపై దృష్టి సారించారు.
ఇదిలావుండగా- పోలింగ్ సందర్భంగా హింసాత్మక పరిస్థితులు తలెత్తిన పశ్చిమ బెంగాల్పైనా ప్రత్యేకంగా నిఘా వేశారు అధికారులు. ఓట్ల లెక్కింపు సందర్భంగా అలాంటి ఘటనలు పునరావృతం అయ్యే ప్రమాదం ఉందని శంకించారు. కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. అదనపు బలగాలను మోహరింపజేశారు. జమ్మూకాశ్మీర్, పంజాబ్, ఉత్తర్ప్రదేశ్ వంటి రాష్ట్రాలకు పారామిలిటరీ బలగాలను మోహరింపజేశారు.