అరకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్యలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్!...
విశాఖపట్టణం:విశాఖపట్టణం జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు దారుణ హత్య నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్ పరిస్థితి నెలకొంది. ఇదే ఘటనలో మాజీ ఎమ్మెల్యే శివేరి సోమని కూడా మావోయిస్టులు మట్టుబెట్టడంతో రెండు రాష్ట్రాల్లో పోలీసులు ఒక్కసారిగా అప్రమప్తమయ్యారు.
ఆదివారం అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు తన మైనింగ్ క్వారీ వద్దకు వెళుతుండగా డుంబ్రీగూడా మండలం లిప్పిట్టిపుట్ట వద్ద మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వైసిపి తరుపున ఎమ్మెల్యేగా గెలిగిన కిడారి ఇటీవలే టిడిపిలో చేరిన విషయం తెలిసిందే. మావోయిస్టుల ఘాతుకం పై అమెరికా పర్యటనలో ఉన్న సిఎం చంద్రబాబు స్పందించారు. ప్రజాస్వామ్యవాదులందరూ ఈ హత్యలను ఖండించాలన్నారు.
తన మైనింగ్ క్వారీ వద్దకు వెళుతున్న అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుపై డుంబ్రీగూడా మండలం లిప్పిట్టిపుట్ట వద్ద ఒకేసారి 60 మంది మావోయిస్టులు దాడిచేసి అతి సమీపం నుంచి కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే శివేరి సోమును కూడా మావోయిస్టులు కాల్చి చంపారు. ఈ దాడిలో సుమారుగా 60 మంది నక్సల్స్ పాల్గొనగా అందులో 40మందికి పైగా మహిళా మావోయిస్టులేనని తెలిసింది.
హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. దాడి గురించి ఎమ్మెల్యే కుమారులను సంప్రదించిన మీడియాతో వారు జరిగిన ఘటన గురించి ఇప్పుడే తెలిసిందని,దాడి వివరాలు ఇంకా తెలియలేదని చెప్పారు. అయితే మావోయిస్టుల నుంచి తనకు ప్రాణ హాని ఉందని తమ తండ్రి ఎప్పుడూ తమతో చెప్పలేదని, మావోలు ఇలా చేస్తారని ఏమాత్రం ఊహించలేదని తెలిపారు.
అయితే ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుకు గత కొంతకాలంగా మావోయిస్టులు నుంచి తీవ్ర స్థాయిలో బెదిరింపులు వస్తున్నట్లు సమాచారం. పైగా ఆయనను హెచ్చరిస్తూ మావోయిస్టులు పలు సందర్భాల్లో వాల్ పోస్టర్లు సైతం ప్రచురించారు. అంతేకాకుండా ఇటీవల మన్యంలో విషజ్వరాల గురించి ఎమ్మెల్యే కిడారి మాట్లాడుతూ అందరం చనిపోవాల్సినవారిమేనని, కాకపోతే ముందూ వెనుకేనని, తానైనా అంతేనని వ్యాఖ్యానించడం ఆయన అనుచరులు గుర్తుచేసుకొని కంటతడిపెడుతున్నారు.
మరోవైపు గత కొన్నేళ్లుగా స్థబ్దుగా ఉన్న మావోయిస్టులు ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ లో ఇంతపెద్ద దాడికి తెగబడటం అటు పోలీసులనే కాదు ఇటు ప్రజాప్రతినిధులను, సామాన్య ప్రజానికాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అసలు మావోల ఉనికే లేదని పోలీసులు చెప్పుకొస్తున్న తరుణంలో మావోయిస్టులు ఇంత భారీ సంఖ్యలో దాడికి దిగడం...పైగా ఒకే ఘటనలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను సునాయాసంగా మట్టుబెట్టడం అనేది అన్ని వర్గాలను నివ్వెరపరిచింది.
ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఎక్కడా ఏ ప్రజాప్రతినిథి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా పర్యటనలకు వెళ్లవద్దని, ఖచ్చితంగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు హెచ్చరించారు. మావోయిస్టుల ముప్పు ఉంటుందని భావిస్తున్న నేతలకు భద్రతను పెంచేశారు. పోలీసు ఉన్నతాధికారులు పోలీసు విభాగాలకు అత్యవసర హెచ్చరికలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిసింది.