కాపులకే సిఎం: చిరుVsబొత్స, ముఖేష్ టిపిసిసి చీఫ్?
మరోవైపు తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నేతలు ముఖేష్ గౌడ్, కిల్లి కృపారాణిలకు అధిష్టానం నుండి పిలుపు వచ్చింది. ముఖేష్ హుటాహుటిన ఢిల్లీ బయలుదేరారు. మంత్రి ముఖేష్ గౌడ్కు తెలంగాణ పిసిసి అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. ఇక ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ నుండి పిలుపు రావడంతో కిల్లి కృపారాణి రేపు ఉదయం ఆమెతో భేటీ కానున్నారు. బొత్స పిలుపుతో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నేతలు ఢిల్లీ చేరుకున్నారు.
కాగా, ముఖ్యమంత్రిగా విజయనగరం జిల్లాకు చెందిన పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నియమితులవుతారనే ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బొత్స కూడా ముఖ్యమంత్రి పదవి కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఆయనకు ముఖ్యమంత్రి పదవి దక్కితే జిల్లా నేతకు ఆ హోదా దక్కటం ఇదే తొలిసారి అవుతుంది.
అధిష్ఠానం వద్ద బొత్సకు పలుకుబడి, అధికార పార్టీ ప్రముఖులతో పరిచయాలు, తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో సఖ్యత ఇవన్నీ తనకు కలిసొచ్చే అంశాలుగా కనబడుతున్నాయి. ఎపి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్సింగ్, గతంలో ఇన్ఛార్జిగా వ్యవహరించిన అజాద్తో సత్సంబంధాలు కలిగి ఉన్నారు.
ఈ కారణంగా సిఎం పీఠంపై బొత్స గురి తప్పదన్న అభిప్రాయం ఆయన అభిమానుల్లో ఉంది. సిఎంగా బొత్స నియమితులైతే సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయనే చివరి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారు. అంతేగాకుండా ఆయన సారథ్యంలో 2014 సార్వత్రిక ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ సమైక్య రాష్ట్రంలోనే నిర్వహించే అవకాశం ఉంటుంది.