కోడి పందాలపై...హై కోర్టు మళ్లీ సీరియస్;ఫెయిల్యూర్ పై చర్యలేవి;ఆ నేతల వివరాలివ్వండి
ఆంధ్రప్రదేశ్లో కోడి పందేలను అడ్డుకోవాలని తాము ఆదేశించినా అధికారులు బేఖాతరు చేయకపోవడంపై హైకోర్టు సోమవారం మళ్లీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని మండిపడింది. కోడి పందేలు నిర్వహించరాదని ఆదేశాలు జారీ చేస్తే, ప్రజాప్రతినిధులు కోర్టు ఆదేశాలను ఎలా ధిక్కరిస్తారని, వారి పూర్తి వివరాలను అందజేయాలని సోమవారం హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ కోడి పందేలు నిర్వహించి తీరుతామని మీడియా ముందు ఎంపీలు, ఎమ్మెల్యేలేగాక స్థానిక ప్రజాప్రతినిధులు సైతం బహిరంగంగా ప్రకటనలు చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది.
భీమవరం మండలం శ్రీరాంపురం/వెంప గ్రామాల్లో కోడి పందేలతో పాటు జూదం, గుండాట, వ్యభిచారం వంటి అసాంఘిక కార్యక్రమాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని, వాటిని అడ్డుకోవాలని కోరుతూ కలిదిండి రామచంద్రరాజు ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై హై కోర్టు విచారించి ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడంతో, తదుపరి కోర్టు ఆదేశాలతో సోమవారం సిఎస్ స్వయంగా హాజరయ్యారు.
కోర్టు ఉత్తర్వులు ఉన్నా...కోడి పందేల్ని నిర్వహించి తీరుతామంటూ మీడియా ముందు ప్రకటించిన ప్రజా ప్రతినిధుల తీరుపై హై కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 144 సెక్షన్ ఉండగా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తేనే పందేలు సాధ్యమని బెంచ్ తప్పుపట్టింది. కోడి పందేల్ని నిర్వహించిన నాయకుల పేర్ల వివరాలు, వారి అడ్రస్ సహా ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపిలను ఆదేశించింది. మీరు వివరాలు ఇస్తేసరి...లేకపోతే టీవీల ఫుటేజీని తెప్పించుకుని కోడి పందేలు ఆడిన నేతలపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హైకోర్టు హెచ్చరించింది. ఇప్పటి వరకు ఎంతమందిపై కేసులు నమెదు చేశారనే వివరాలు అందజేయా లని సూచించింది. నిర్వాహకుల వివరాలతో పాటు వారి అడ్రస్లను కూడా కోర్టు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కోర్టు కోరిన సమాచారం ఇవ్వడానికి సమయం ఇవ్వాలని ఏజీ అభ్యర్థించారు. సీఎస్ ఓ నివేదికను కోర్టు పరిశీలనకు ఇచ్చారు. గత ఏడాదితో పోల్చిచూస్తే కోడి పందేల బరుల సంఖ్య, పాల్గొనవారి సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. గత ఏడాది ఇచ్చిన ఉత్తర్వుల్ని అమలు చేయలేకపోయిన పశ్చిమ గోదావరి జిల్లాలోని 48 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 43 మంది తహసీల్దార్లపై నమోదు చేసిన కేసుల వివరాలు కూడా అందజేయాలని ఆదేశిస్తూ కేసు విచారణ ఫిబ్రవరి 12కి వాయిదా వేసింది. హైకోర్టుకు సోమవారం హాజరైన దినేశ్కుమార్కు తదుపరి విచారణకు రాకుండా మినహాయింపు ఇచ్చింది.ఈమేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ ఎమ్ఎస్ కే జైస్వాల్తో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశాలు జారీచేసింది.