"చెన్నంపల్లి కోట"లో తవ్వకాల వివరాలివ్వండి: ఎపి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
Recommended Video
కర్నూలు జిల్లా తుగ్గిలి మండల పరిధిలోని చెన్నంపల్లి కోటలో గుప్త నిధుల కోసం ఎపి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న తవ్వకాలకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు ఎపి ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ ఎం.ఎస్.కె. జైశ్వాల్తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
చెన్నంపల్లి కోటలో గుప్త నిధుల కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న తవ్వకాలపై మీడియాలో వస్తున్న వార్తా కథనాలను కర్నూలు జిల్లా, దూపాడుకు చెందిన బ్రహ్మారెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తవ్వకాల పేరుతో చారిత్రక కట్టడాలను ధ్వంసం చేసేస్తున్నారని, దీనిని అడ్డుకోవాలంటూ ఆయన హైకోర్టుకు లేఖ రాశారు.
దీన్ని పరిశీలించిన ఏసీజే జస్టిస్ రమేశ్ రంగనాథన్ ఈ లేఖను పిల్ గా మలచాలని సూచించడంతో ఆ మేరకు మార్పు చేశారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి, పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.