2019 సంక్రాంతి పండుగ తరువాత హైకోర్టు అమరావతికి తరలింపు!...నిర్మాణ పనులపై సీజే సంతృప్తి
అమరావతి:ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి ధర్మాసనంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు...2019 జనవరిలో సంక్రాంతి పండుగ సెలవుల తర్వాత నవ్యాంధ్ర రాజధాని అమరావతికి తరలివచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ బృందం శనివారం అమరావతిలో నిర్మితమవుతున్న తాత్కాలిక హైకోర్టు నిర్మాణం పురోగతి పనులను పరిశీలించింది. పనుల పరిశీలన కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు హై కోర్టు న్యాయమూర్తులను కలసి మాట్లాడారు. హై కోర్టు నిర్మాణ పనులను తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా హైకోర్టు తరలింపు అంశం వారి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది.
అమరావతిలో...ఛీప్ జస్టిస్
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోని నేలపాడు రెవెన్యూ ప్రాంతంలో నిర్మాణం జరుగుతున్న జుడీషీయల్ కాంప్లెక్స్ పనులను హైకోర్టు చీఫ్ జస్టిస్ బి.రాధాకృష్ణన్ నేతృత్వంలోని 8 మంది న్యాయమూర్తుల బృందం శనివారం పరిశీలించింది. ఈ సందర్భంగా కోర్టు హాళ్లను సిజే పరిశీలించి తగిన సూచనలు చేశారు. కాంప్లెక్స్ మధ్య భాగంలో కడుతున్న ఓ నిర్మాణం గురించి చీఫ్ జస్టిస్ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.
పనుల పురోగతి...పరిశీలన
హై కోర్టు హాల్స్ డిజైన్లు, న్యాయమూర్తుల చాంబర్లు, అడ్వకేటు కార్యాలయాలు, ఫుల్ కోర్టు సమావేశ మందిరం, ఫర్నిచర్, కోర్టుకు రాకపోకల మార్గాలు ఇలా వివిధ అంశాలకు సంబంధించిన వివరాలను సిజే బృందం అధికారులను అడిగి తెలుసుకుంది. అలాగే న్యాయమూర్తుల నివాసాల నిర్మాణం గురించి కూడా బృందం వాకబు చేసింది. తాత్కాలిక హై కోర్టు నిర్మాణంతో పాటు జుడీషియల్ కాంప్లెక్స్ నిర్మాణాల పురోగతి పరిశీలన అనంతరం జస్టిస్ రాధాకృష్ణన్ బృందం విజయవాడలో తాము బసచేసిన ప్రైవేట్ హోటల్ కు మళ్లింది.
సిజేతో...చంద్రబాబు భేటీ
ప్రైవేట్ హోటల్ లో బస చేసిన జస్టిస్ రాధాకృష్ణన్ బృందాన్ని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మర్యాద పూర్వకంగా కలసి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య తాత్కాలిక హై కోర్టు భవనాల నిర్మాణం, జుడీషియల్ కాంప్లెక్స్, హైకోర్టు అమరావతికి తరలింపు తదిదర అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ సందర్భంగా తాత్కాలిక హైకోర్టు నిర్మాణం పురోగతి, ఇతర సదుపాయాలపై ప్రధాన న్యాయమూర్తి, ఆయన బృందం సభ్యులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
తాను...రాలేకపోవచ్చన్న సిజే
ఈ సందర్భంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ బి.రాధాకృష్ణన్ మాట్లాడుతూ అమరావతిలో ఏర్పాటయ్యే హైకోర్టుకు వచ్చే అవకాశం తనకు ఉండకపోవచ్చని...ఆ అవకాశం ఉంటే తాను తప్పనిసరిగా వచ్చేవాడనని...ఇక్కడ అంత బాగా సదుపాయాలు కల్పిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబుతో వ్యాఖ్యానించినట్లు ఒక పత్రిక పేర్కొంది. అంతేకాకుండా తాము మూడు వారాల కిందట వచ్చినప్పటి కంటే ఇప్పుడు పనులు బాగా వేగం పుంజుకున్నాయని సిజే వ్యాఖ్యానించారని న్యాయమూర్తులు తెలిపినట్లు ఆ పత్రిక వెల్లడించింది.
పండుగ తరువాత...తరలింపు
ఈ సందర్భంగా న్యాయమూర్తులు అమరావతికి హైకోర్టును తరలింపు విషయం గురించి మాట్లాడుతూ...ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వాల్సిఉందని, ఒకవేళ జనవరి ఒకటో తేదీన ఆ ఉత్తర్వులు అందినట్లయితే...సంక్రాంతి సెలవుల తర్వాత ఇక్కడ నుంచే కోర్టు పనిచేయడం ప్రారంభించే అవకాశం ఉందని న్యాయమూర్తులు అభిప్రాయపడినట్లు తెలిసింది. హైకోర్టుకు జనవరి ఒకటో తేదీ నుంచి పద్దెనిమిదో తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉండొచ్చని...అందువల్ల ఆ తరువాతే అమరావతిలో హై కోర్టు ఏర్పాటు ఉండొచ్చనేది వారి అభిప్రాయంగా తెలుస్తోంది.
సిజేతో...న్యాయమూర్తుల బృందం
అమరావతిలో న్యాయస్థానాల నిర్మాణం పనులు పరిశీలించిన చీఫ్ జస్టిస్ వెంట పర్యటించిన బృందంలో హైకోర్టు పోర్టుపోలియో న్యాయమూర్తి జస్టిస్ రామసుబ్రహ్మణ్యం, జస్టిస్ ప్రవీణ్కుమార్, జస్టిస్ ఎస్వీ భట్, జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ సునీల్చౌదరి, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి, గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి హరిహరనాథశర్మ, గుంటూరు జూనియర్ సివిల్జడ్జి ఎ.వి. రామకృష్ణయ్య, మంగళగిరి సీనియర్ సివిల్ జడ్జి వి.భవాని ఉన్నారు.