హైకోర్టు విభజన: జనవరి 1 నుండి విడివిడిగా : ఏ జడ్జిని ఏ రాష్టంకు కేటాయించారంటే..
ఎట్టకేలకు ఉమ్మడి హైకోర్టు విభజన పూర్తయింది. కొత్త సంవత్సరం జనవరి 1 నుండి హైకోర్టు రెండుగా విడిపోనుంది. రెండు రాష్ట్ర హైకోర్టులు అదే రోజు నుండి విడివిడిగా పని చేయనున్నాయి. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్రపతి ఏపికి 16 మంది..తెలంగాణ కు 10 మంది జడ్జీలను కేటాయించారు.
ఏపి హైకోర్టు ఒక రెండు గా
దశాబ్దాల కాలంగా ఉన్న ఏపి హైకోర్టు ఒక రెండు గా విడిపోనుంది. ఉమ్మడి హైకోర్టును ఏపి - తెలంగాణ కు విడివిడిగా విభజిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం హైకోర్టును విభజించాలని తెలంగాణ న్యాయవాదులు చాలా కాలం ఆందోళన చేసారు. దీని పై పార్లమెంట్లో తెలంగాణ ఎంపీలు నిరసన వ్యక్తం చేసారు. ఆ తరువాత న్యాయస్థానంలోనూ ఇదే అంశం పై విచారణ జరిగింది. అయితే, ఏపి ప్రభుత్వం తాము ఈ డిసెంబర్ చివరి నాటికి హైకోర్టును సిద్దం చేస్తామని ప్రకటించింది. దీంతో..హై కోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటుగా న్యాయమూర్తులు అందరూ అమరావతిలో నిర్మిస్తున్న జస్టిస్ సిటీ ని సందర్శించారు. హైకోర్టు నిర్మాణ తీరు పై సంతృప్తి వ్యక్తం చేసారు. మరి కొద్ది రోజుల్లో హైకోర్టు భవనం పూర్తి చేస్తామని తాజాగా సీఆర్డీఏ అధికారులు సైతం ప్రకటించారు. ఇదే సమయం లో హైకోర్టు విభజన పై రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసారు.
ఏ జడ్జిని ఎక్కడ కేటాయించారు..
రాష్ట్రపతి విడుదల చేసిన ఉమ్మడి హైకోర్టు విభజనపై గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా 2019 జనవరి 1 నుంచి విడివిడిగా కార్యకలాపాలు నిర్వహించనున్నాయి. తెలంగాణకు 10మంది, ఏపీకి 16 మంది జడ్జిల కేటాయిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వు లు జారీ చేశారు. ఏపికి... న్యాయమూర్తులు.. రమేష్ రంగనాధన్ (ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి), జస్టిస్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ వెంకట నారాయణ భట్టి, జస్టిస్ ఆకుల వెంకట శేష సాయి, జస్టిస్ దామ శేషాద్రి నాయుడు, జస్టిస్ సీతారామ మూర్తి, జస్టిస్ ఉప్మాక దుర్గా ప్రసాదరావు, జస్టిస్ తాళ్లూరి సునీల్ చౌదరి, జస్టిస్ సత్యనారాయణ మూర్తి, జస్టిస్ శ్యాం ప్రసాద్, జస్టిస్ ఉమాదేవి, జస్టిస్ నక్కా బాలయోగి, జస్టిస్ రజని. జస్టిస్ వెంకట సుబ్రమణ్య నారాయణ సోమయాజులు, జస్టిస్ కొంగర విజయ లక్ష్మీ, జస్టిస్ గంగారావు లు ఏపికి కేటాయించిన వారిలో ఉన్నారు..
తెలంగాణ కు కేటాయించిన వారు..
విభజన లో భాగంగా..తెలంగాణకు 10 మంది న్యాయమూర్తులను కేటాయించారు. అందులో జస్టిస్ పి. వెంకట సంజయ్ కుమార్, జస్టిస్ ఎం. సత్యరత్న శ్రీరామ చంద్రరావు, జస్టిస్ ఏ.రాజశేఖర రెడ్డి, జస్టిస్ పి. నవీన్ రావు, జస్టిస చల్లా కోదండరాం చౌదరి, జస్టిస్ శివ శంకర రావు, జస్టిస్ డా. షమీమ్ అక్తర్, జస్టిస్ పి కేశవరావు, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ టి. అమర్నాధ్ గౌడ్ లను తెలంగాణ కేటాయించారు.