మీరు దర్యాఫ్తు చేయడమేంటి?: జగన్పై కత్తి దాడి కేసులో ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్రఆగ్రహం
విజయవాడ/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన విశాఖపట్నం విమానాశ్రయంలో కత్తి దాడి కేసులో హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వంపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రజారాజ్యంతో దెబ్బతిన్నాం: టిక్కెట్లపై తేల్చేసిన పవన్ కళ్యాణ్, బాబూ! తెలంగాణలో జనసేననా?
ఎన్ఐఏకు ఎందుకు అప్పగించలేదు
జగన్ పైన దాడి విమానాశ్రయంలో జరిగితే ఏపీ పోలీసులు ఎందుకు విచారణ జరుపుతారని ప్రశ్నించింది. ఈ కేసును జాతీయ దర్యాఫ్తు సంస్థ (ఎన్ఐఏ)కు ఎందుకు అప్పగించలేదని చురకలు అంటించింది. ఈ కేసును ఎన్ఐఏకు ఎందుకు బదలీ చేయలేదో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.
జగన్ మీద దాడిపై ఆళ్ల పిల్
వైయస్ జగన్మోహన్ రెడ్డిపై దాదాపు నెల పది రోజుల క్రితం విశాఖపట్నం విమానాశ్రయంలో కత్తితో దాడి జరిగిన విషయం రెండు తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ అంశంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కేసును ఏపీ పోలీసుల పరిధి నుంచి ఎన్ఐఏకు బదలీ చేసేలా ఆదేశించాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పిల్ దాఖలు చేశారు.
ఏపీ ప్రభుత్వం తమ పరిధిలోకి తీసుకుందని అభ్యంతరం
దీనిని సోమవారం విచారించిన న్యాయస్థానం ఏపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసును తక్షణం ఎన్ఐఏను అప్పగించకపోవడంపై కౌంటర్ దాఖలు చేయాలని చెప్పింది. ఆళ్ల తరఫున లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసి కావాలనే ఏపీ ప్రభుత్వం విచారణను తమ పరిధిలోకి తీసుకొని చేస్తోందని తెలిపారు. ఎన్ఐఏ యాక్ట్ సెక్షన్ 6 ప్రకారం ఎయిర్ పోర్టు లేదా ఎయిర్ క్రాఫ్టులో అఫెన్స్ జరిగితే విచారణ ఎన్ఐఏ పరిధిలోకి వస్తుందని తెలిపారు. ఆన్ లా పుల్ ఎగైనెస్ట్ సేఫ్టీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ యాక్ట్ ప్రకారం సెక్షన్3(ఏ) కింద కేసు నమోదు చేయాలని, వారి వాదనలతో ఏకీభవించిన కోర్టు ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
ఏపీ ప్రభుత్వ లాయర్ ఏమన్నారంటే?
జగన్ తరఫు లాయర్ మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) విచారణను నిలిపివేయాలని కోరారు. ఈ వ్యవహారంపై ఎన్ఐఏతో విచారణ జరిపించాలని కోరారు. అయిత ఈ వాదనలను ఏపీ ప్రభుత్వం తరఫు లాయర్ ఖండించారు. సిట్ అధికారుల విచారణ చాలా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరుగుతోందని ఏపీ ప్రభుత్వ లాయర్ తెలిపారు.