ఎమ్మెల్సీ అనంతబాబుకు స్పష్టంగా చెప్పిన హైకోర్టు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తన కారు మాజీ డ్రైవర్, దళిత యువకుడు సుబ్రమణ్యం హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. పోలీసులు 90 రోజుల్లోగా ఛార్జిషీటు దాఖలు చేయనందున బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు.
విచారణ సందర్భంగా న్యాయస్థానం ఆ పిటిషన్ను కొట్టేసింది. బెయిల్ పిటిషన్ను కింద కోర్టు కొట్టేయడంతోనే ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న అనంతబాబు రిమాండ్ను ఎస్సీ, ఎస్టీ కోర్టు మరోసారి పొడిగించింది. అక్టోబరు 7వ తేదీ వరకు రిమాండ్లో ఉంచుతూ న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు.
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కొన్నాళ్ల క్రితం తన కారు డ్రైవర్ సుబ్రమణ్యంను హత్య చేసి డెడ్ బాడీని నేరుగా తనకారులోనే తెచ్చి ఇంటిదగ్గర వదిలివెళ్లాడు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఇదొక్కటే కాకుండా గతంలో ఆయన వ్యవహారశైలి, నమోదైన కేసులు తదితర వివరాలన్నీ బయటకు వచ్చాయి. రంగురాళ్ల నుంచి డెడ్బాడీని డోర్ డెలివరీ చేసేవరకు సాగిన ఆయన రాజకీయ ప్రస్థానమంతా వివాదాలమయం.
సుబ్రమణ్యం హత్య కేసులో అనంతబాబు పలు కీలక వివరాలను వెల్లడించాడు. తన వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే కాకుండా బయట కూడా మాట్లాడటంతో బెదిరించి వదిలేద్దామనుకున్నానని, తప్పనిసరి పరిస్థితుల్లో చంపేయల్సి వచ్చిందని పోలీసులతో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే 90 రోజులకు కూడా పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేయకపోవడం వెనక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతలున్నారని ఆరోపణలు వచ్చాయి.