ఏపీ మున్సిపల్ పోరుకు లైన్ క్లియర్- 16 పిటిషన్లను తోసిపుచ్చిన హైకోర్టు
ఏపీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై సందిగ్ధం తొలగిపోయింది. మున్సిపల్ ఎన్నకలను గతంలో ఆగిన చోట నుంచే తిరిగి నిర్వహించేలా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు ఇవాళ కొట్టేసింది. దీంతో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను పునఃప్రారంభించందుకు లైన్ క్లియర్ అయింది.
గతేడాది కరోనా కంటే ముందు జారీ చేసిన నోటిపికేషన్ ఆధారంగానే మున్సిపల్ ఎన్నికలు జరుపుతామని ఎస్ఈసీ గతంలో ప్రకటించింది. ఈ మేరకు మార్చి 2 నుంచి ఎన్నికల ప్రక్రియ తిరిగి ప్రారంభించేలా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వీటిని సవాల్ చేస్తూ హైకోర్టులో పలువురు అభ్యర్ధులు పిటిషన్లు దాఖలు చేశారు. పాత నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికలు జరిగితే తాము పోటీ చేసేందుకు వీల్లేకుండా పోతుందని వాదించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్ధానం రెండురోజుల క్రితమే దాన్ని ముగించి తీర్పును రిజర్వ్లో పెట్టింది. ఇవాళ తుది తీర్పు ప్రకటించింది.
పాత నోటిఫికేషన్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించేందుకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో రాష్ట్రంలోని 12 కార్పోరేషన్లు, 75 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు ఎన్నికల ప్రక్రియ తిరిగి ప్రారంభం కానుంది. ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ ముగియగా.. వచ్చే నెల 2 నుంచి నామినేషన్ల ఉపసంహరణకు మార్గం సుగమమైంది. మార్చి 10న ఎన్నికలు, మార్చి 14న కౌంటింగ్ నిర్వహిస్తారు. ప్రభుత్వం, ఎస్ఈసీ ఇద్దరూ పాత నోటిఫికేషన్కు కట్టుబడిన నేపథ్యంలో పిటిషనర్ల వాదనలు చెల్లకుండా పోయాయి.