హైకోర్టు ధర్మసందేహం:పార్టీ ఫిరాయింపుల వ్యాజ్యంపై...విచారించవచ్చా?
హైదరాబాద్:వైసీపీ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఓ వ్యక్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హై కోర్టు సందేహం వ్యక్తం చేసింది. ఈ పిల్ ను విచారణకు స్వీకరించవచ్చో లేదోనని డౌట్ వెలిబుచ్చింది.
దీంతో పిటిషనర్ తరుపు న్యాయవాది ఈ పిల్ కు విచారణ అర్హత ఉందనే అంశాన్నిధృవీకరించేందుకు పూర్తి స్థాయి వాదనలు వినిపించేందుకు గడువు కోరగా ఆ మేరకు కోర్టు ఈ నెల 25 కు వాయిదా వేసింది. పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన వారిపై చర్యలకు ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా వాసి సతీశ్కుమార్ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంతో పాటు, ఈ ఫిరాయింపులను ప్రొత్సహిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడుపై చర్యలు తీసుకునేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా విద్యానగర్కు చెందిన సతీశ్కుమార్ హైకోర్టులో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం సోమవారం విచారణకు వచ్చింది. ఈ పిల్ ను జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం దీనిని విచారించింది.
పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదులు స్పీకర్ ముందు పెండింగ్లో ఉండగా కోర్టు ఎలా జోక్యం చేసుకోగలదని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. అందువల్లే ఈ వ్యాజ్యానికి విచారణ అర్హతపై తమకు సందేహాలు ఉన్నాయని తెలిపింది. అయితే రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వారికి నోటీసులు ఇచ్చి వివరణ కోరడంలో తప్పులేదని పిటిషనర్ సతీష్ కుమార్ తరఫు సీనియర్ న్యాయవాది సీవీ మోహన్రెడ్డి వాదించారు.
స్పీకర్ తన వద్ద ఉన్న ఫిర్యాదులపై చర్యలు తీసుకోకుండా సుదీర్ఘకాలం పెండింగ్లో పెట్టేసిప్పుడు రాజ్యాంగం ప్రకారం కోర్టులు జోక్యం చేసుకోవచ్చని చెప్పారు. అయితే తమ వ్యాజ్యానికి విచారణార్హత ఉందనే అంశంపై పూర్తి స్థాయి వాదనలు చెప్పేందుకు న్యాయవాది సీవీ మోహన్రెడ్డి గడువు కోరగా ధర్మాసనం అంగీకరించి పిల్ పై విచారణ ఈ నెల 25 కు వాయిదా వేసింది.