సీఆర్డీయే కమిషనర్పై మండిపడిన హైకోర్టు...జరిమానా విధింపు
హైదరాబాద్: కోర్టు ఉత్తర్వులు అమలు చేయని కారణంగా సీఆర్డీయే కమిషనర్ చెరుకూరి శ్రీధర్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనకు రూ.2 వేలు జరిమానా విధించింది.
ఈ క్రమంలో కమిషనర్ తరఫున స్పెషల్ జీపీ రమేష్ వాదిస్తూ కోర్టు ఉత్తర్వులను కమిషనర్ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించలేదని హై కోర్టుకు తెలిపారు. అలాగే సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలు నిలుపుదల చేయాలని ధర్మాసనంను స్పెషల్ జిపి అభ్యర్థించారు. అయితే అలా స్టే ఇవ్వాలంటే రూ. 2 లక్షలు జమ చేయాల్సి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది.
సింగిల్ జడ్జి ఆదేశాలపై స్టే కోసం స్పెషల్ జీపీ రమేష్ వాదనలు విన్న ధర్మాసనం సింగిల్ జడ్జి ఆదేశాలు నెలరోజుల పాటు నిలపుదల చేస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. అయితే...జరిమానా మొత్తాన్నివెంటనే డిపాజిట్ చేయాలని తేల్చి చెప్పింది. డిపాజిట్ చేసిన రూ.2 వేలు కోర్టు ఇచ్చే తుదితీర్పునకు లోబడి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్, జస్టిస్ ఎస్వీ భట్తో కూడిన హై కోర్టు ధర్మాసనం సోమవారం ఆదేశాలు జారీచేసింది.
సీఆర్డీఏ పరిధిలోని విజయవాడ మురళీనగర్లో అనుమతి లేకుండా నిర్మించిన అదనపు అంతస్థు విషయమై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిని విచారణ కు స్వీకరించిన హై కోర్టు విచారణ సందర్భంగా అదనంగా నిర్మించిన అంతస్తు క్రమబద్ధీకరణ విషయంలో పిటిషనర్ వాదనలు పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది. అతడి వాదనలు తిరస్కరించడానికి తగిన కారణాలు చూపిన అనంతరమే క్రమబద్ధీకరణ చేయాలని ఉత్తర్వులు జారీచేసింది.
అయితే పిటిషనర్ వివరణ తీసుకోకుండానే నిబంధనలకు విరుద్దంగా అదనంగా నిర్మించిన అంతస్థును సిఆర్డీయే అధికారులు క్రమబద్ధీకరించారు. దీంతో పిటిషనర్ ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో సీఆర్డీఏ కమిషనర్పై సుమోటోగా కేసు నమోదు చేసిన కోర్టు ఆయనకు రూ.2 వేలు జరిమానా విధించింది. అలాగే జరిమానా చెల్లించని పక్షంలో 4 వారాలు సాధారణ జైలుశిక్ష అనుభవించాలని జూలై 17న తీర్పు చెప్పింది.
ఈ సింగిల్ జడ్జి ఆదేశాలపై సీఆర్డీయే కమిషనర్ హైకోర్టుకు అప్పీలు చేశారు. ఈ అప్పీలు విచారణ సందర్భంగా సిఆర్డీఏ కమీషనర్ హై కోర్టు ఉత్తర్వులు బేఖాతరు చేసిన విషయం తెలియడంతో ధర్మాసనం సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం ఎస్జీపీ అభ్యర్థన మేరకు అప్పీలు పిటిషన్ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం సింగిల్ జడ్జి ఆదేశాలపై నెల రోజుల పాటు స్టే మంజూరు చేసింది.