ఏపీ సర్కార్ కు హైకోర్టు అక్షింతలు .. మా ఆదేశాలే బేఖాతరు చేస్తారా అంటూ ఫైర్
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు అక్షింతలు వేసింది. ఏపీలో నిర్వహించాల్సిన గ్రామ పంచాయతీ ఎన్నికల జాప్యంపై ఏపీ హైకోర్టు మండిపడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీల కాల పరిమితి ముగిసినా ఇప్పటివరకు ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదంటూ అసహనం వ్యక్తం చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చి 13 నెలలు పూర్తైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హైకోర్టు ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.
'ఇదేం జగన్-కేసీఆర్ పంచాయతీ కాదు! ఇలా చేసిన తొలి సర్కారు జగన్మోహన్ రెడ్డిదే!!’
ఏపీలో పంచాయితీ ఎన్నికలపై హైకోర్టులో కేసు
ఏపీలో 12,775 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. గ్రామ పంచాయితీల కాలపరిమితి ముగిసిన ఇప్పటివరకు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టలేదని తాండవ యోగేష్ అనే ఒక అడ్వకేట్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఉమ్మడి హైకోర్టు 2018 అక్టోబర్ 23న తీర్పు ఇస్తూ ఈ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ను ఆదేశించిందన్నారు.
కాలపరిమితి ముగిసినా ఎన్నికలు నిర్వహించకపోవటంపై హైకోర్టు ఆగ్రహం
అయితే, ఎన్నికల కమిషన్ మాత్రం ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేయని కారణంగా ఎన్నికలు నిర్వహించలేదని అఫిడ్విట్లో పేర్కొందని అన్నారు. ఇక ఇందుకు సంబంధించి విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన, అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ పైన కూడా అసహనం వ్యక్తం చేసింది. ఎన్నికలు నిర్వహించడంలో జాప్యంపైన పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని సీఎస్ ను ఆదేశించింది.
రాష్ట్ర విపత్తులు, ఉద్యోగాల భర్తీ, సచివాలయాల ఏర్పాటు కారణాలుగా చెప్పిన ప్రభుత్వం
అయితే రాష్ట్ర విపత్తుల వల్ల ఎన్నికలు నిర్వహించలేక పోయామని ప్రభుత్వం తరఫు న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు. అంతేకాకుండా ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలల కాలమేనని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ సచివాలయాలు ఏర్పాటు, ఉద్యోగాల భర్తీ వంటి కార్యక్రమాలను నిర్వహించడంతో ఎన్నికలపైనే ఇంకా దృష్టి సారించలేకపోయామనీ ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.
రిజర్వేషన్లు నోటిఫై చేస్తే ఎన్నికలు నిర్వహిస్తామన్న ఈసీ
ఇక రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరఫున లాయర్ వీవీ ప్రభాకరరావు వాదనలు వినిపించారు. పంచాయతీ వార్డులు , సర్పంచి సీట్ల విషయంలో రిజర్వేషన్లను ప్రభుత్వం నోటిఫై చేస్తే ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. నోటిఫై చేయకపోవడంతో ఎన్నికలు నిర్వహించలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వం ఎన్ని కారణాలు చెప్పినప్పటికీ హైకోర్టు ధర్మాసనం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని పేర్కొంది.
తమ ఆదేశాలు బేఖాతరు చేస్తారా అని ఫైర్ అయిన కోర్టు.. విచారణ 21కి వాయిదా
ఎన్నికలు నిర్వహించకపోవడం, హైకోర్టు ఉత్తర్వులు పాటించకపోవడం, రాజ్యంగ నిబంధనలను ఉల్లఘించడమేనంటూ వ్యాఖ్యానించింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తన అధికారాన్ని ఎందుకు వినియోగించుకోలేదో దానికి సంబంధించి, కోర్టు ఆదేశాలను అధికారులు ఎందుకు పట్టించుకోలేదో తెలియడం లేదని అసహనం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు ఎన్నికల నిర్వహించకపోవడంపై ప్రభుత్వానికి అక్షింతలు వేసిన కోర్టు ఇరుపక్షాల వాదనలు విన్న మేరకు విచారణను 21వ తేదీకి వాయిదా వేసింది.