గాలి బెయిల్ స్కాం: మాజీ జడ్జి ప్రభాకరరావు అనుమాస్పద మృతి
హైదరాబాద్: హైకోర్టు మాజీ జడ్జి ప్రభాకరరావు ఆదివారం ఉదయం 6.30 గంటల సమయంలో ఆయన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆదివారం ఉదయం ఆయన ఇంటికి వెళ్లిన కుమారుడు తండ్రి విగతజీవుడిగా కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న తుకారాం గేట్ పోలీసులు తొలుత ఆయన సహజ మరణం చెంది ఉండొచ్చని భావించినా, సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం 174 ఐపీసీ కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు మాత్రం ప్రభాకరరావుది ఆత్మహత్య లేక గుండెపోటుతో మరణించారా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నివేదిక వస్తే గానీ ఆసలు విషయం వెల్లడవుతుందని పోలీసులు తెలిపారు. జడ్జిగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఆయన గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ స్కాంలో నిందితుడిగా ఉన్నాననే అవమానాన్ని భరించలేకే ఆత్మహత్య చేసుకున్నారా? లేక మరెవరైనా ఆయన మరణానికి కారకులా అన్నది తేలాల్సి వుంది.
ఆత్మహత్య కాదు, గుండెపోటు: ప్రభాకరరావు కుమారుడు
ఇది ఇలా ఉంటే తన తండ్రి ఆత్మహత్య చేసుకోలేదని, అనుమానాస్పద మృతి కాదని మాజీ జడ్జి ప్రభాకర్ రావు కుమారుడు డేవిడ్ ప్రశాంత్ వ్యాఖ్యానించారు. సోమవారం మీడియా ముందుకు వచ్చిన ఆయన, తీవ్రమైన గుండెపోటుతో తన తండ్రి మరణించారని, ఆసుపత్రికి తీసుకువెళ్లే సమయం కూడా తమకు లేకపోయిందని తెలిపారు.
తన తండ్రి మరణాన్ని రాజకీయం చేయవద్దని కోరారు. పోలీసుల విచారణకు సహకరిస్తామని అన్నారు. కొంతకాలంగా ఆయన కకావికలమైన మనస్సుతో మనస్తాపంగా ఉంటున్నారని డేవిడ్ ప్రశాంత్ తెలిపారు. ప్రభాకర్ రావు మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయనున్నారు.
కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన రెడ్డికి బెయిల్ డీల్ కేసులో జడ్జి ప్రభాకరరావు నిందితుడిగా ఉన్నారు. ఓఎంసీకి సంబంధించిన కేసులో గాలి జనార్ధన్ రెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు గాను జడ్జి ప్రభాకరరావు భారీ మొత్తంలో డబ్బు తీసుకున్నాడనే ఆరోపణలు వచ్చాయి.
దీంతో ఏసీబీ అధికారులు ఆయన్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. అంతేకాదు గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ స్కాం కేసులో ఏసీబీ కోర్టులో చార్జిషీట్ను కూడా దాఖలు చేశారు. ఓఎంసి కేసులో అరెస్టయిన గాలి జనార్దన రెడ్డిని బెయిల్పై బయటకు తేవడానికి నిందితులు చేసిన ప్రయత్నాలను అందులో వివరించారు.
గాలిని బయటకు తెచ్చేందుకు రెండు మార్గాల్లో వంద కోట్లు ఖర్చు చేయడానికి నిందితులు సిద్ధమైనట్లు పేర్కొనడంతో పాటు ఏడుగురిపై అభియోగాలు నమోదు చేశారు. చార్జిషీట్లో గాలికి బెయిల్ కోసం జడ్జీలు లక్ష్మీ నరసింహారావు, ప్రభాకర్ రావు చేసిన ప్రయత్నాలు, ఇందులో గాలి బంధువు దశరథరామి రెడ్డి, కంప్లి ఎమ్మెల్యే సురేష్ బాబు, రియల్ ఎస్టేట్ వ్యాపారి రావి సూర్యప్రకాశ్ పాత్రను వెల్లడించింది.
హైకోర్టు రిజిస్ట్రార్ లక్ష్మీనరసింహ రావును ఏప్రిల్ 13న గాలి బంధువు దశరథరామి రెడ్డి బెయిల్ కోసం సంప్రదించారని, ఎంత డబ్బయినా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పడంతో రిజిస్ట్రార్ వంద కోట్లు అడిగారని ఛార్జీషీట్లో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.
అందుకు దశరథరామి రెడ్డి సంసిద్ధత వ్యక్తం చేయడంతో అప్పటి సిబిఐ కోర్టు జడ్జి నాగమారుతి శర్మను ఇంటికి పిలిచి లక్ష్మీనరసింహ రావు 40కోట్లు ఆఫర్ చేశారని, అయితే ఆయన తిరస్కరించడంతో ప్రయత్నం బెడిసి కొట్టిందని, దీంతో కొత్త సిబిఐ కోర్టులు ప్రారంభమయ్యాక ప్రభాకరరావు ద్వారా మరో ప్రయత్నం చేశారని పేర్కొందని సమాచారం.
మే 3న ఢిల్లీ నుంచి గాలి సోదరుడు సోమశేఖర్ రెడ్డి, దశరథరామిరెడ్డి వస్తుండగా విమానాశ్రయంలో సూర్యప్రకాశ్ బాబు, కొల్లి లక్ష్మయ్య చౌదరి కలిశారని పేర్కొంది. ప్రభాకరరావుతో పని పూర్తిచేయిస్తానని లక్ష్మీనరసింహ రావు చెప్పినట్లు దశరథరామి రెడ్డికి సూర్యప్రకాశ్ చెప్పారని, అందుకు పదికోట్లు ఇవ్వాలని కోరారని, అయితే రూ. 15కోట్లయినా ఇస్తామని, అయితే ముందుగా జడ్జి పట్టాభి రామారావుతో తమకు ఓ సమావేశం ఏర్పాటు చేయాలని దశరథరామి రెడ్డి షరతు పెట్టారని, పట్టాభి కలవకపోవడంతో ఆ ప్రయత్నమూ విఫలమైందని, చివరికి రౌడీషీటర్ యాదగిరి ప్రయత్నంతో మే రెండో వారంలో గాలికి బెయిలొచ్చిందని రెండో చార్జిషీట్లో ఏసీబీ వివరించిన సంగతి తెలిసిందే.